AP : కి రఘురామరాజు ఎలానో.. తెలంగాణకి రేవంత్ రెడ్డి అలా అని చెప్పాలి. కాకపోతే వీరి చేష్టలే పిచ్చోళ్ళా.. మంచోళ్లా..? అనే ఆలోచనకు ఆస్కారమిస్తాయి. ఇద్దరూ రాజకీయ నాయకులే అయినా.. ఏపీకి AP అంతకుమించి లక్షణాలు వారిలో కనిపిస్తాయి. ఇద్దరూ పార్టీలు మారిన నాయకులే. ఇద్దరి చుట్టూ వివాదాలే నెలకొన్నాయి. ఒకరేమో స్వపక్షంపైనే పోరాటం చేస్తూంటారు.. మరొకరేమో విపక్షం మీద పోరాటం చేయాలని భావిస్తూ ఉంటారు. ఇద్దరి లక్ష్యం కూడా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాధినేతలపైనే. మాటల తూటాలతో విరుచుకుపడటం వారికి అలవాటు. కానీ.. ఇదే వీరికి ఓదశలో క్రేజ్ తీసుకొచ్చి.. ఇప్పుడు ‘ఏం మాట్లాడతారో..’ అనే ఆసక్తి నుంచి.. ‘ఏం మాట్లాడుతున్నారు’ అనే స్థితికి వచ్చేశారు. దీంతో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్నాళ్లు సీరియస్ గా నడిచినా ప్రస్తుతం కామెడీ అయిపోయాయి.
రఘురామకృష్ణ రాజు ఇలా..
రఘురామకృష్ణ రాజునే తీసుకుంటే ఆయన బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలన్నీ చూసేసి.. 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చారు. జగన్ అంటే.. అంత.. ఇంత అన్నారు. నర్సాపురం నుంచి ఎంపీగా గెలిచారు. కారణమేదైనా.. సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేయడం మొదలెట్టారు. ఎమ్మెల్యేల నుంచి ఏకంగా సీఎం జగన్ నే టార్గెట్ చేశారు. ఎంత తొక్కితే అంత పైకి లేచే జగన్ కు ఇది నచ్చుతుందా..? లైట్ తీసుకున్నారు. రఘురామ మాత్రం ప్రభుత్వం నుంచి సీఎం జగన్ పై విమర్శలు ఆపలేదు. నియోజకవర్గంలో రక్షణ లేదని ఢిల్లోలోనే ఉండి హోంమంత్రి, లోక్ సభ స్పీకర్లను కలిసి చెప్పాల్సింది చెప్పారు. ఎంపీ కాబట్టి వై క్యాటగిరీ భద్రత ఇచ్చింది కేంద్రం. అయినా.. నియోజకవర్గానికి రాకపోగా.. వారిని వెనకబెట్టుకుని ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి మరీ జగన్ ను దూనమాడారు. ఇంత చేస్తే పార్లమెంట్ లో ఆయన సీటు ముందు వరస నుంచి రెండు వరుసలు పైకి మార్చింది. ఇప్పుడాయన ఊసే మీడియాలో లేదు. ‘రోజూ ఉండేదే..’ అనిపించడమే ఇందుకు కారణం. ఇదే జగన్ స్ట్రాటజీ. ఆయన్ను పట్టించుకోకుండా ‘లైట్’ అయ్యేలా చేసేశారు.
రేవంత్ రెడ్డి ఇలా..
రేవంత్ రెడ్డి తీరు ఇందుకు కాస్త భిన్నం. టీడీపీలో ఉంటూ చంద్రబాబు మీద ప్రేమతో సీఎం కేసీఆర్ ను ఓ రేంజ్ లో ఆడుకోబోయి ఓటుకు నోటు కేసులో అడ్డంగా ఇరుక్కునేలా చేసి కేసీఆర్ తెలివితేటలు నిరూపించుకున్నారు. రాజకీయ వైరం కాస్తా.. వ్యక్తిగత వైరం అయిపోయింది. తెలంగాణలో కేసీఆర్ ను ధీటుగా ఎదిరించగల నాయకుడిగా ఇప్పటికీ రేవంత్ పేరు. అందుకే.. టీడీపీలో ఉండి ఏం చేయలేమని చంద్రబాబుకు ఓ మాట చెప్పి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి కేసీఆర్ పై పదునైన విమర్శలు మొదలుపెట్టారు. ఏదైనా సమస్యపై ప్రశ్నిస్తే కొన్ని రోజుల్లోనే ఆ విషయాన్ని వదిలేస్తారు. కేటీఆర్ ఫామ్ కట్టారని విమర్శలు చేసి కొన్నాళ్లకు వదిలేశారు. కేసీఆర్ అవినీతి చేశారని గొంతెత్తి అరచి.. వదిలేశారు. ఇప్పుడు తమిళనాడు ఎన్నికలకు కేసీఆర్ నిధులు ఇస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. దేనినీ ఆధారాలతో సహా నిరూపించలేదు రేవంత్ రెడ్డి. దీంతో కాంగ్రెస్ తోపాటే ఆయన మాట కూడా బలహీనం అయిపోయింది. ఇప్పుడు రేవంత్ మాట వినిపిస్తుందే తప్ప ఆయన్ను పట్టించుకునేవారు కరువయ్యారు.
ఇద్దరి తీరు మార్చుకుంటారా..?
ఇదీ.. ఇద్దరు నాయకుల తీరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరికీ రాజకీయ అనుభవం ఉంది. కానీ.. బలమైన వ్యవస్థలుగా ఉన్న వైసీపీ, టీఆర్ఎస్ లతో తలపడుతున్నారు. తెలంగాణలో కనీసం అధికారంలో ఉన్న పార్టీపై పోరు. కానీ.. ఏపీలో స్వపక్షంలోనే పోటీ. కేసీఆర్ అసలు రేవంత్ ను లెక్కలోకి తీసుకోకపోగా.. రఘురామకృష్ణ రాజును జగన్ లైట్ తీసుకున్నారు. ఎంపీలతో మీటింగ్ కు సైతం రఘురామకృష్ణ రాజుకు ఆహ్వానం ఉండదు. విమర్శలు చేసినంతగా ఆధారాలు చూపకపోవడం.. ప్రతి చిన్న విషయాన్నీ విమర్శించడం వీరిద్దరి నైజం. రేవంత్ కు సొంత పార్ట కాంగ్రెస్ నుంచే సరైన ప్రోత్సాహం లేదు. టీపీసీసీ ప్రెసిడెంట్ పై కన్నేసిన రేవంత్ ను కాంగ్రెస్ రాజకీయాలు ఎక్కనివ్వట్లేదు. స్వపక్షంపైనే పోరు నడిపి హైలైట్ అవుదామని చూసిన రఘురామరాజుకు జగన్ తన మార్క్ ఝలక్ ఇచ్చినట్టే. దీంతో వాగ్దాటి ఉన్న రెండు రాష్ట్రాల్లోని ఇద్దరు నాయకులు ప్రస్తుతం సైలన్స్ అయ్యారని చెప్పాలి.