అమరావతి: అసెంబ్లీలో జనసేన సభ్యుడు రాపాక వరప్రసాద్పై చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సభలో ఆసక్తికర వాతావరణం నెలకొంది. ప్రత్యేక హోదాపై తీర్మానం సందర్భంగా రాపాక వరప్రసాద్ తన ప్రసంగంలో వైసిపి తన మిత్రపక్షం బిజెపిని ఒప్పించి ప్రత్యేక హోదా తీసుకురావాలని అన్నారు. దీనిపై వెంటనే చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పందిస్తూ జనసేన సభ్యుడు నోటికి ఏదిపడితే అది మాట్లాడటం సరికాదు అంటూ మండిపడ్డారు. బిజెపితో తమకు ఎలాంటి పొత్తులేదనీ, టిడిపితోనే జనసేనకు ఉన్న అంతర్గత పొత్తు గురించి అందరికీ తెలిసిందేనని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
దీంతో రాపాక ‘అధ్యక్షా, నాపై శ్రీకాంత్ రెడ్డి అన్నేసి బాణాలు ఎక్కుపెట్టనక్కర్లేదు, నా వైపు ఎవరూ లేరు, సభలో మా పార్టీకి ఉన్నది ఒక్కడినే, కనీసం జాలి చూపించండి’ అని అనడంతో సభలో నవ్వులు పూసాయి. మిమ్మల్ని రక్షించడానికి స్పీకర్ ఉన్నాడని మర్చిపోకండని తమ్మినేని సీతారాం అభయం ఇచ్చారు. సామరస్య పూర్వకంగా వివరణ ఇస్తూ వైసిపికి బిజెపి మిత్ర పక్షం అనడం తప్పేనని అంగీకరించారు.
బిజెపితో సఖ్యతగా ఉన్నారన్న కోణంలోనే తాను ఈ వాఖ్య చేశాననీ రాపాక వివరణ ఇచ్చారు. బిజెపితో స్నేహపూర్వకంగా మెలిగి ప్రత్యేక హోదా తీసుకురావాలన్నదే తన ఉద్దేశమని రాపాక పేర్కొన్నారు. సిఎం జగన్ కూడా రాపాక మాట్లాడున్న తీరును చిరునవ్వుతో ఆస్వాదించారు.