అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసిపిలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తీరాల్సిందేనని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టిడిపికి పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ సభ్యుడైనా రాజీనామా చేయకుండా పార్టీ మారితే చర్యలు తప్పవని ఆయన అన్నారు. సభా నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కూడా పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పష్టమైన వైఖరి అసెంబ్లీలోనే తెలియజేశారనీ, దానికే తాను కట్టుబడి ఉన్నానని తమ్మినేని అన్నారు.
డిసెంబర్ రెండవ తేదీ నుండి ఏపి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయనీ, 15 రోజుల పాటు సమావేశాలు జరుగనున్నాయని ఆయన తెలిపారు. శాసనసభ, శాసన మండలి వ్యవస్థలను డిజిటలైజ్ చేస్తున్నామని తమ్మినేని తెలిపారు. ఇప్పటికే పేపర్ లెస్ డిజిటలైజ్ దిశగా చర్యలు చేపట్టామని చెప్పారు.