ప్రస్తుతం గల్లీ నుండి ఢిల్లీ వరకు వైకాపా రెబల్ ఎం పీ రఘు రామ కృష్ణం రాజు వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. తాను పార్టీకి, అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విధేయుడనేననీ అంటూనే సొంత పార్టీ నేతలపై, ప్రభుత్వ వ్యవహారాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది మొదలు.. షోకాజ్ నోటీసుపై స్పందించిన తీరు.. ఆయన రాసిన లేఖలు, కేంద్ర పెద్దలను కలవడం.. అన్నీ కూడా చర్చనీయాంశాలుగా మారాయి.
ఈ నేపథ్యంలో రఘు రామ కృష్ణం రాజు పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న వైకాపా అధిష్టానం.. ఆయనను పార్టీ నుండే కాక పార్లమెంట్ నుండి కూడా గెంటివేయించాలని కంకణం కట్టుకుంది. అనుకున్నదే తడవుగా వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నేతృత్వంలో ఎంపీల బృందం ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు అందజేశారు. దీనిపై లోక్ సభ స్పీకర్ ఓం బిల్లా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఆసక్తి గా మారింది.
రఘు రామ కృష్ణం రాజు వ్యవహారం పై ఇంత వరకు లోక్ సభ స్పీకర్ అయితే స్పందించలేదు కానీ ఏపి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగానే నరసాపురం ఎంపీ రఘు రామ కృష్ణం రాజు విమర్శలు చేస్తున్నారని పేర్కొన్న తమ్మినేని…పార్టీ నచ్చకపోతే రఘురామ కృష్ణంరాజు రాజీనామా చేసి వెళ్లిపోవచ్చని వ్యాఖ్యానించారు. పనిలో పనిగా న్యాయ వ్యవస్థపైనా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తమ్మినేని. ఒక వ్యవస్థలో మరో వ్యవస్థ జోక్యం సరికాదని అయన అన్నారు. సూచనలు ఇవ్వలే కానీ నిర్ణయాలు తీసుకోవడం సరి కాదని తమ్మినేని పేర్కొన్నారు. పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసుపై ఎంపీ రఘు రామ కృష్ణంరాజు హైకోర్టు ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో తమ్మినేని ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అవుతున్నాయి.