అమరావతి : తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలను అడ్డుపెట్టుకొని సంక్షేమ పథకాలు అన్నీ పచ్చ చొక్కాల వారికే కట్టబెట్టారనీ ఎన్నికల ముందు వైసీపీ నేతలు పదేపదే ఉపన్యాసాలలో దంచేశారు. వైసీపీ అధికారం రావడంలోకి వచ్చిన వెంటనే కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని హామీలు ఇచ్చారు. అయితే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలోనూ టీడీపీ సానుభూతి పరులకు 40 శాతంకు పైగా సంక్షేమ పధకాలు మంజూరు అవుతుండటంతో వైసీపీ శ్రేణులు అవాక్కు అవుతున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య మంత్రిగా భాద్యతలు చేపట్టిన నాడే గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా సంక్షేమ పథకాల మంజూరులో కులం, మతం, పార్టీ అనే భేదాలు లేకుండా అర్హులందరికీ అందిస్తామని ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అధికారులు అదే విధంగా లబ్ధిదారుల ఎంపిక నిర్వహిస్తున్నారు. అయితే రాష్ట్రంలో నగదు బదిలీ పథకాలు గొప్పగా అమలు జరుగుతున్నా పార్టీ శ్రేణులకు పెద్దగా మైలేజీ రావడం లేదని భావిస్తున్నారు. 40 శాతంకు పైగా టీడీపీ శ్రేణులు లబ్ది పొందుతున్నారని వారు వైసీపీకి ఓటు వేసే రకాలు కాదని పేర్కొంటున్నారు.
రాష్ట్రంలో అమలు అవుతున్న నగదు బదిలీపై వైసీపీ నేతలు ఏమంటున్నారనే దానిపై ఆరా తీయగా ఆసక్తికరమైన విషయాలు వెల్లడి అయ్యాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల కోట్లది మంది లబ్ధి పొందుతున్నారు. నగదు బదిలీ వల్ల గ్రామాల్లో కొన్ని కుటుంబాలు ఎంతగా లాభ పడుతున్నాయో అనే విషయాలు వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నారు.
ప్రకాశం జిల్లాలో ఓ టీడీపీ సానుభూతిపరుడైన ఆటో డ్రైవర్ కుటుంబానికి ఈ పథకాల వల్ల భారీగా లబ్ధి భారీగా చేకూరిందట.. ఆ ఆటో డ్రైవర్ కుటుంబంలో ఇద్దరు పిల్లలు. వారిలో అమ్మాయి 9వ తరగతి చదువుతోంది. అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో వీరికి అమ్మ ఒడి పథకం కింద రూ.15వేలు, జగన్ అన్న విద్యా దీవెన కింద రూ.20వేలు, ఆటో డ్రైవర్ కావడంతో ఆ పథకంలో రూ.10 వేలు, అతని భార్య టైలర్ కావడంతో ఆ పథకం కింద రూ.10వేలు, రైతు భరోసా కింద రూ.7500తో పాటు ప్రధాని మోడీ ఇచ్చిన 6000 తో రూ.13500 లబ్ధి చేకూరాయి. మొత్తం ఆ కుటుంబానికి అక్షరాల రూ.68,500 సాయం జగన్ ప్రభుత్వంలో అందింది. ఇది గమనించిన వైసీపీ శ్రేణులు అవాక్కు అయ్యారుట. తాము పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నా ఈ మాదిరి సాయం అందలేదంటూ వాపోవడం వారి వంతు అయింది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. సీఎం జగన్ ఎంత డబ్బులు ఇచ్చినా నా ఓటు మాత్రం ‘టీడీపీకే’ అని సదరు ఆటో డ్రైవర్ చెప్పడం. ఈ మాటలు విని వైసీపీ శ్రేణులు షాక్ అయ్యారట. ఇది గమనించి అయినా పార్టీ కోసం కష్టపడినవారికి న్యాయం జరిగేలా నాయకులు కృషి చేయాలని వారు కోరుకుంటున్నారుట.