అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరో సారి జల జగడం రాజుకున్నది. ఉభయ రాష్ట్రాల పరిధిలో ఉన్న శ్రీశైలం డ్యామ్ మిగులు జలాలను పోతిరెడ్డిపాడుకు తరలించాలని ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమని తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రకటించారు. తెలంగాణ అభ్యంతరాలపై ఏపి సిఎం జగన్ ధీటుగానే సమాధానం ఇచ్చారు.
కాగా ఈ వివాదంపై ఏపి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు.
బుధవారం ఉదయం గుంటూరు జిల్లాలోని రెడ్డిపాలెంలో గల కోవిడ్ క్వారంటైన్ సెంటర్ను ఆయన మాజీ మంత్రి రావెల కిషోర్తో కలిసి పరిశీలించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ
శ్రీశైలంలోని మిగులు జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకునే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తో న్యాయ పోరాటం చేస్తారో..! ఏమీ చేస్తారో..? మాకు తెలియదు, ఏపీ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గకుండా రాయలసీమకు నీళ్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని గతంలోనే భారతీయ జనతా పార్టీ పోరాటం చేసిందని ఈ సందర్భంగా కన్నా గుర్తు చేశారు.