అమరావతి: మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు.
వివేకా హత్య కేసు నిందితులను ఇప్పటి వరకూ ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. మార్చిలో హత్య జరిగితే ఇప్పటి వరకూ నిందితులను అరెస్టు చేయలేకపోయారని కన్నా విమర్శించారు. కేసు దర్యాప్తును చేయడం రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాకపోతే సిబిఐకి అప్పగించాలని ఆయన కోరారు. సిఎం జగన్కు చిన్నాన్న అయినప్పటికీ వివేకా హత్యకేసులో పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో విచారణ సవ్యంగా సాగడం లేదని కన్నా విమర్శించారు.
వైఎస్ వివేకానందతో తనకు అత్యంత సన్నిహత సంబంధాలు ఉన్నాయనీ, ఆయన దారుణ హత్య తనను కలచివేసిందన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వివేకా హత్య కేసులో దర్యాప్తు వేగవంతం అవుతుందని తాను ఆశించాననీ, అయినప్పటికీ వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉందనీ ఆయన చెప్పారు.
హత్య జరిగి ఏడు నెలలు తరువాత కూడా విచారణ ఇంకా కొనసాగుతూనే ఉండటం వల్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కన్నా అన్నారు. ఈ హత్య కేసును సిబిఐకి అప్పగిస్తే దర్యాప్తు సజావుగా సాగుతుందని తాను విశ్వసిస్తున్నానని కన్నా పేర్కొన్నారు.