వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాగైనా మూడు రాజధానుల బిల్లు, సిఆర్డీఏ సవరణ బిల్లులను ఆమోదింప చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నది. ఇందు కోసం ఆ బిల్లులను గవర్నర్ బిశ్వబ్యూషన్ హరిచందన్ ఆమోదం కొరకు పంపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ బిల్లులపై టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ…గవర్నర్ తొందరపాటు నిర్ణయం తీసుకొని ఆమోదించవద్దని, కేంద్రానికి పంపాలని విజ్ఞప్తి చేసింది. గవర్నర్ నిర్ణయం కీలకం అయిన ఈ తరుణంలో తాజాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖలు రాయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ రెండు పార్టీలకు శాసనసభలో ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ జాతీయ పార్టీలు కావడం గమనార్హం.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలు ఆమోదించడం లేదని, ప్రభుత్వం పంపిన రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ సవరణ బిల్లులను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆమోదించవద్దని కన్నా లక్ష్మీ నారాయణ లేఖలో కోరారు. దీనికి గల కారణాలను లేఖలో అయన ఉదహరించారు. ఒక పక్క సీఆర్డీయే చట్టం రద్దు బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే, మరో పక్క రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం బిల్లుకు వ్యతిరేకంగా ఉందని కన్నా పేర్కొన్నారు. ఈ బిల్లులపై ఇటు ప్రజల, అటు రైతుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని అయన గవర్నర్ ను కోరారు. ఈ సందర్బంగా రాజధాని ప్రాంత ప్రజలు చేస్తున్న శాంతియుత నిరసనలను కూడా పరిశీలించాలని కన్నా కోరారు. తొలి నుండి అమరావతి రాజధాని విషయంలో బీజేపీ స్టాండ్ స్పష్టంగానే ఉన్నది. అయితే కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారు అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉన్నది. రాష్ట్రానికి సంబంధించిన ఈ కీలక బిల్లుల విషయంలో రాష్ట్ర గవర్నర్… కేంద్రానికి సంప్రదించకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోరు అన్నది అందరికీ తెలిసిందే. అయితే రాజధాని ఏర్పాటు అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని ఇప్పటికే బీజేపీ పెద్దలు స్పష్టం చేశారు. బీజేపీ వేరు, కేంద్ర ప్రభుత్వం వేరు అన్నట్లుగా చెప్పుకుంటూ వచ్చారు. ఈ విషయంలో కేంద్రంపై బీజేపీ వత్తిడి తీసుకువచ్చి బిల్లులను నిలుపుదల చేయిస్తుందా? కేంద్రంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వైకాపా ప్రభుత్వానికి మద్దతుగా కీలక బిల్లుల ఆమోదంకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అనేది కొద్ది రోజులలో తేలనుంది.