వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదం కొరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు పంపిన విషయం తెలిసిందే. మూడు రాజధానుల విషయంలో సీఎం వైఎస్ జగన్ చాలా పట్టుదలగా ఉన్న నేపథ్యంలో ఈ బిల్లులను ఆమోదించ వద్దంటూ టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గవర్నర్ కు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. దీనిపై గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నారు అనే దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్నది.
ఇది ఇలా ఉండగా బిజెపికి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ కు లేఖ రాయడం తీవ్ర దుమారాన్ని రేపుతున్నది. మూడు రాజధానుల అంశంపై బిజెపి పెద్దల నిర్ణయానికి భిన్నంగా కన్నా గవర్నర్ లేఖ రాశారని, దీనితో బీజేపీ పెద్దలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో లేదో తెలియదు కానీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డి.. కన్నాపై బీజేపీ పెద్దలు మండిపడ్డారు అంటూ ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నది.
అమరావతి నుండి రాజధాని తరలింపు అంశంలో తొలి నుండి రాష్ట్ర బీజేపీ ఒకే స్టాండ్ పై ఉన్నది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నది. అయితే రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్సింహారావు, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ దేవధర్ లాంటి నాయకులు స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోదని కూడా వారు గతంలోనూ చెప్పారు. దీని బట్టి చూస్తే మూడు రాజధానుల విషయంలో జగన్ ప్రభుత్వానికి కేంద్రం సహకరిస్తుందన్న సంకేతాలు వస్తున్నాయి.
కాగా బీజేపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందంటూ విజయసాయి చేసిన విమర్శలకు కన్నా స్పందించలేదు. ఈ వ్యవహారంలో బీజేపీ డబుల్ గేమా? సింగిల్ గేమా అనేది త్వరలో తేలనుంది.