(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
రాబోయే 2024 ఎన్నికల నాటికి ఏపిలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చూస్తున్న బిజెపి.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఆర్ ఎస్ ఎస్ నేపథ్యం ఉన్న సోము వీర్రాజును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. స్వతహాగా రాష్ట్రంలో బిజెపి బలం చాలా స్వల్పం అయినప్పటికీ కేంద్రంలో అధికారాన్ని సుస్ధిరం చేసుకున్న కారణంగా ఏపిలోనూ పావులు కదపడతానికి వ్యూహరచన చేస్తున్నది. అందులో భాగంగానే రెండవ పర్యాయం కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజుకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీతో పొత్తు కూడా పెట్టుకున్నది.
జనసేన – బిజెపి కూటమి నేతృత్వంలో 2024లో ఏపిలో అధికారంలోకి వస్తామంటూ సోము వీర్రాజు ఆశాభావం వ్యక్తం చేస్తూన్నారు. ముందుగా సోము వీర్రాజు రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేయడానికి క్యాస్ట్ కార్డు వాడే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాలలో ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించే ఆలోచన చేస్తున్నారుట. రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు ఉన్నది జనసేన, బిజెపి కూటమికేనని చెబుతూ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులకు గాలం వేసే పనిలో భాగంగా సోము వీర్రాజు కార్యాలయం నుండి ఫోన్ లు చేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో అత్యధిక కమ్మ సామాజిక వర్గం టీడీపికి, అత్యధిక రెడ్డి సామాజిక వర్గం వైసీపీకి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. జనసేన, బిజెపి కూటమి కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే పార్టీగా గుర్తింపు తీసుకువస్తే ఇతర సామాజిక వర్గాలను తరువాత కూడగట్టవచ్చన్న భావనతో సోము వీర్రాజు స్కేచ్ వేస్తున్నారన్నది టాక్.
రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నాఇతర వర్గాలతో పాటు కాపు సామాజిక వర్గ ఓటర్లు కీలకం అన్న విషయం అందరికీ తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో తొలుత మెజారిటీ కాపు సామాజిక వర్గీయులు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవడంతో అధికారంలోకి వచ్చింది. అయితే వంగవీటి మోహనరంగా హత్య తరువాత మెజార్టీ కాపు సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యింది. దీంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. రాష్ట్రంలో నాడు కాంగ్రెస్ గానీ తరువాత తెలుగుదేశం గానీ, ఇప్పుడు వైసీపీ గానీ కాపు సామాజిక వర్గ నేతలకు మంత్రివర్గంలోనూ ఇతర ముఖ్యమైన కార్పోరేషన్ పదవుల్లోనూ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాయి.
పలు ప్రభుత్వాలలో కాపు నేతలు మంత్రులుగా బాధ్యతలు నిర్వహించినా ముఖ్యమంత్రి పదవి లభించలేదన్న వెలితి ఆ సామాజికవర్గీయుల్లో ఉన్నది. ఈ తరుణంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించడంతో రాష్ట్రంలో మెజారిటీ కాపులు ఆయనకు జై కొట్టినా అధికారానికి చేరువ కాలేకపోయింది ప్రజారాజ్యం పార్టీ. ఆ తరువాత చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినా పవన్ కళ్యాణ్కు మద్దతు పలికితే చంద్రబాబుకు మద్దతు ఇచ్చినట్లే అవుతుందని వైసీపీ విస్తృతంగా ప్రచారం చేయడంతో టీడీపీకి వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ మంది కాపు సామాజిక వర్గ నేతలు వైసీపీకి జై కొట్టారు. దీంతో జనసేన ఆశించిన స్థానాలు కూడా కైవశం చేసుకోలేకపోయింది.
ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో పవన్ కలిసి అధికారంలోకి వచ్చేది బిజెపియేనని సోము వీర్రాజు పార్టీ బలోపేతానికి పావులు కదుపుతున్నారు అని సమాచారం. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నట్లు ముందుగా సొంత సామాజిక వర్గీయల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో బిజిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో రాజమండ్రిలో కాపు నేతలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని భావిస్తున్నారుట సోము వీర్రాజు. ఒక పక్క హింధూత్వ అజెండాతో ముందుకు సాగుతూ సొంత సామాజిక వర్గ బలం కూడగడితే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగవచ్చనేది సోము వీర్రాజు భావానగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆశలు, ఆశయాలు ఎంత వరకూ ఫలిస్తాయో కాలమే సమాధానం చెబుతుంది.