AP BJP: ఓటింగ్ లేని సత్తువతో.. సత్తాలేని నాయకత్వంతో.. నాయకత్వం లేని నియోజకవర్గాలతో.. మాట్లాడలేని నాలుకలతో.. నాలుకలు లేని నాయకులతో.. ఇలా అన్ని రకాలుగా ఏపీలో బీజేపీ ఇబ్బంది పడుతుంది.. పార్టీ ఈ రాష్ట్రంలో బలంగా లేదు. బలోపేతానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు.. “ఓ రాష్ట్రంలో రాజకీయంగా పట్టు పెంచుకోవాలంటే.. ప్రగతికి సహకరించి, రాష్ట్రంలో ప్రాజెక్టులకు ప్రాధాన్యతనివ్వాలని” బీజేపీకి బాగా తెలుసు. కాకపోతే ఈ మూల సూత్రాన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో తప్పితే దక్షిణాది రాష్ట్రాల్లో.., మరీ ముఖ్యంగా ఏపీలో లేదు. అందుకే ఆ పార్టీకి ఏపీలో నూకలు చెల్లుతున్నాయి. తాజాగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఏపీలో బీజేపీ ఇక మూత దశకు చేరుకున్నట్టే అనే కొత్త వాదనలు వస్తున్నాయి. ఎందుకంటే..!?
AP BJP: రఘురామ వ్యవహారంలో నాలుక మడత పెట్టేసారు..!!
ఏపీలో బీజేపీకి ఎంతో కొంత క్షత్రియ సామాజికవర్గం అండగా నిలిచేది. ఈ ఓట్లు అధికంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో టీడీపీ పొత్తు ఉన్న ప్రతీసారి బీజేపీ గెలిచింది. గెలిచినా ప్రతీసారి రాజులే ఉండేవారు. కృష్ణంరాజు, గంగరాజు, రామరాజు ఇలా చాల మందే ఉన్నారు. అందుకే బీజేపీతో ఆ సామాజికవర్గానికి ఒక ప్రత్యేక బాండింగ్ ఏర్పడింది. కృష్ణంరాజు రూపంలో ఇప్పటికీ ఇది కొనసాగుతుంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి టార్గెట్ గా మారి, అరెస్టయిన రఘురామకృష్ణం రాజు ఇదే సామాజికవర్గానికి చెందిన ఎంపీ. ఈయన్ను రెండు రోజుల కిందట అరెస్టు చేస్తే ఏపీలో బీజేపీ నాయకులు ఎవ్వరూ, ఏమీ మాట్లాడలేదు. అరెస్టుని ఖండించలేదు, లేదా సపోర్ట్ చేయలేదు. సోము వీర్రాజు సహా పురంధేశ్వరి, జీవీఎల్ నరసింహారావు, మురళీధర్, సునీల్ ధియోధర్, సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, కామినేని శ్రీనివాస్, కంభంపాటి హరిబాబు.. ఈ ఎవ్వరూ ఏమి మాట్లాడలేదు. కానీ..
బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు..!!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. “ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా..? ఒక ఎంపీని పట్టుకుని థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారా..? పోలీసులు దాష్టీకం చర్యకు పాల్పడ్డారు. జగన్ భజన కోసం ఇలా ప్రవర్తించడం మంచిది కాదు” అంటూ బండి సంజయ్ ఏపీ ప్రభుత్వ, పోలీసుల తీరుని తప్పు పట్టారు. ఇవే వ్యాఖ్యలు అధికారికంగా సోము వీర్రాజు, పురంధేశ్వరి.., లేదా ఏపీ బీజేపీ నాయకులు ఎవరో ఒకరు చేసి ఉంటే వేరేలా ఉండేది. పోనీ అరెస్టు మంచిదే అనుకుంటే.. “అరెస్టు చేసి మంచి పని చేసారు. గుడ్” అంటూ అయినా మాట్లాడాల్సింది.” అదేమి లేకుండా. తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడకుండా ఉత్తుత్తి ఢిల్లీ భజనతో ఏపీకి, ఆ నాయకత్వానికి.. ఓటర్లకు ఒరిగేదేమిటో..!?
తిరుపతి ఫలితంతో ఖంగు తిన్నట్టేనా..!?
తిరుపతి ఫలితంతో బీజేపీలో తీవ్ర నైరాశ్యం అలముకుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ప్రతీసారి సోము వీర్రాజు “మాకు, జనసేనకు కలిపి 10 శాతం ఓటింగ్ ఉంది. మేము దాన్ని 30 శాతానికి తీసుకుపోతాం. మా బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. మా ముఖ్యమంత్రి ఆయన, ఈయన అంటూ చిన్నపిల్లాడి ఆటలాడేవారు. తిరుపతిలో బీజేపీ – జనసేనా వ్యవహారం, అసలు బలం తేలిపోయింది. కనీసం తక్కువలో తక్కువ లక్ష ఓట్లు వస్తాయనుకున్నప్పటికీ.. అక్కడ 57 వేలు ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆ పార్టీ ఢిల్లీ పెద్దలు ఏపీలోని ఈ గంభీర ప్రగల్బాలు నాయకులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. కనీసం పది శాతం ఓటింగ్ సాధించలేకుండా ఎందుకు ఈ నాయకత్వం అంటూ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదట… ఆ నైరాశ్యానికి తోడు, ఈ రఘురామ వ్యవహారంలో ఏం మాట్లాడాలో.., ఏం చేయాలో తెలియక.. నాయకత్వానికి ఈ సబ్జెక్టు డీల్ చేయడం, రాజకీయంగా వాడుకోవడం చేతగాక సైలెంట్ గా ఉన్నట్టు చెప్పుకోవచ్చు..!