పూర్వశ్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మంత్రి. ఆ తరువాత ఏపిలో మరో జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు. వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వంపై అవకాశం చిక్కినప్పుడల్లా విమర్శలు చేస్తూ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా లేఖాస్త్రాలు సంధిస్తూ, టిడిపి అధినేత చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన ఆ నాయకుడు గత కొద్ది రోజులుగా ఎక్కడా కనిపించడం లేదు. ఆయన మాట వినిపించడం లేదు. పదవి నుండి పార్టీ అధిష్టానం తప్పిందని అలిగారా? లేక పార్టీకి ఆయన సేవలు అవసరం లేదని మిన్నకుండిపోయారా? లేక తన మాట లెక్క చేసే వారు ఎవరు లేరని గమ్మునుండి పోయారా? ఆ నేత. ఇప్పటికి అర్ధం అయింది కదా ఆ నాయకుడు ఎవరో. అదే నండీ కన్నా లక్ష్మీనారాయణ గారు.
సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కాపురం చేసిన కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర విభజన తరువాత ఏపిలో కాంగ్రెస్ పార్టీ తుడిచి పెట్టుకుపోవడంతో ఆ పార్టీలో కొనసాగితే ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి ప్రత్యామ్యాయ దారులకు అన్వేషించారు. వైసీపీలో చేరాలని తొలుత ఆయన భావించినా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి నుండి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో బీజేపి తీర్ధం పుచ్చుకున్నారు. చేరిన కొద్ది రోజులకే అనూహ్యంగా ఆయనకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది బిజెపి. ఆ పార్టీలో దిగువ స్థాయి నుండి అంచలంచెలుగాఎదిగిన ఎందరో నాయకులు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నా కన్నాకు ఆ పదవి వరించడం కొందరికి అసంతృప్తి కల్గించింది. అయినప్పటికీ పార్టీ హైకమాండ్ ఆదేశాలను గౌరవిస్తూ మిన్నకుండిపోయారు ఆ నేతలు. కన్నా బిజెపి పగ్గాలు చేపట్టినప్పటి నుండి వైసిపికి వ్యతిరేకంగా, టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇది ఆ పార్టీలోని కొందరు నాయకులకు గిట్టలేదు. కేంద్రంలోని బిజెపి పెద్దలు కూడా రాష్ట్రంలో తమ స్టాండ్ ఏమిటో స్పష్టంగా ప్రకటించలేదు. అధికార వైసీపీకి అనుకూలమా కాదా అనేది తేల్చకుండా సఖ్యతగా ఉండీ లేనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. పాపం లౌక్యం తెలియని కన్నా సారు అదేమి పట్టన్నట్లు జగన్మోహనరెడ్డి సర్కార్ పై అవకాశం చిక్కినప్పుడల్లా విమర్శలు సంధిస్తూ వచ్చారు. రాష్ట్రంలో బిజెపి బలోపేతానికి తన వంతు కృషి జరుపుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనను పట్టించుకోకపోయినా సమస్యలపై లేఖలు రాస్తూ వచ్చారు. కన్నా రాసిన ఏ లేఖకు సిఎం జగన్ నుండి ప్రత్యుత్తరం గానీ స్పందన కానీ లేదు. సిఎం జగన్ ప్రకటించిన మూడు రాజధానుల ప్రకటనను ప్రధాన తెలుగుదేశం పార్టీతో పాటు కన్నా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. రాజధాని అమరావతి ప్రాంత రైతుల ఆందోళనకు మద్దతు తెలియజేయడంతో పాటు అమరావతికి అనుకూలంగా తమ పార్టీ కార్యవర్గ సమావేశంలో తీర్మానం కూడా చేయించారు. అయితే పార్టీలోని కన్నా వ్యతిరేక వర్గీయులు రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించడం కోసం వ్యూహాత్మకంగా పావులు కదిపారు. విజయం సాధించారు.
తొలి నుండి టీడీపీపై, చంద్రబాబుపై ఒంటి కాలిపై లేస్తూ విమర్శలు చేసే సోము వీర్రాజుకు పార్టీ పగ్గాలు అప్పగించింది బిజెపి. సోము కాస్తో కూస్తో వైసీపీకి అనుకూలమనే పేరు కూడా ఉంది. అయితే సోము వీర్రాజు నియామకం తరువాత ఆయన ప్రమాణ స్వీకారం రోజున మాత్రమే కనిపించిన కన్నా లక్ష్మీనారాయణ అప్పటి నుండి అడ్రస్ లేకుండా పోయారు. కన్నా ఎక్కడా కనిపించడం లేదు. ఆయన మాన వినిపించడమూ లేదు. పార్టీ అధ్యక్ష పదవి ఊడిపోయినప్పటి నుండి ఆయన దూరంగా ఉండటంతో అసంతృప్తితో అలక బూనారేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండేళ్లకు పైగా కన్నా లక్ష్మీనారాయణ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నా పార్టీలోని ఏ ఒక్క నాయకుడిపై సస్పెన్షన్ వేటు లాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు కానీ సోము వీర్రాజు నియామకం జరిగిన తరువాత పార్టీ స్టాండ్ కు భిన్నంగా ఎవరు వ్యవహరించినా సస్పెండ్ తో నోరు మూయించేస్తున్నారు. టివి డిబేట్ లకు గానూ ఆ పార్టీ నాయకులు వెళ్లి ఇష్టానుసారంగా మాట్లాడటానికి వీలు లేకుండా కట్టడి చేశారు సోము వీర్రాజు. అమరావతి రైతుల పక్షాన మాట్లాడినందుకు ఇద్దరు సీనియర్ నేతలపై షోకాజు నోటీసులు లాంటివి ఏమీ లేకుండానే సస్పెన్షన్ వేటు వేశారు సోము వీర్రాజు. ఈ నేపథ్యంలో కన్నా బయటకు వచ్చి ఏది మాట్లాడినా సోము చెక్ పెడతారని భయమో లేక అలక పానుపు ఎక్కి సైలెంట్ గా ఉండిపోయారో తెలియాలంటే కొద్ది రోజలు వేచి చూడాలి.