(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ బిజెపి నేతల తీరు ఎవరి తీరు వారిదే అన్నట్లు కనబడుతోంది. అమరావతి రాజధాని విషయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఒక్కరు మాత్రమే మొదటి నుండి గట్టిగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కన్నా మినహా బిజెపిలోని ఇతర నేతలు ఎవరూ అధికారపక్షంపై అంతగా దూకుడుగా వ్యవహరించడం లేదు.
రాబోయే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న బిజెపి…రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నుండి బలమైన నాయకులకు గాలం వేయడానికి ప్రయత్నించింది. అయితే వైఎస్ఆర్ పార్టీ నేతల నుండి స్పందన కొరవడింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ ఘోర పరాజయం పాలవ్వడంతో ఆ పార్టీలోని నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, సిఎం రమేష్, టిజి వెంకటేష్, గరికపాటి రామ్మోహనరావులు బిజెపిలో చేరిపోయారు. ఇటీవల కాలంలో జనసేనతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుండి బిజెపి నేతలు పరస్పర విరుద్దమైన ప్రకటనలు చేస్తూ వచ్చారు. అమరావతి నుండి రాజధాని ఒక్క అడుగు కూడా కదలదని సుజనా చౌదరి పేర్కొనడం, అమరావతి నుండి రాజధాని తరలిస్తే సహించేది లేదనీ, అడ్డుకుని తీరుతామనీ కన్నా లక్ష్మీనారాయణ శపధం చేస్తుండగా రాజధాని అంశంలో కేంద్రం రాజ్యాంగ బద్ధంగానే నడుచుకుంటుందని అదే పార్టీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ అధికార ప్రతినిధి జివిఎల్ నర్శింహరావు స్పష్టం చేస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీలు మాధవ్, సోము వీర్రాజు ఎవరికి వారు విరుద్ధ ప్రకటనలు చేస్తుండగా మాజీ ఎంపి దగ్గుబాటి పురందీశ్వరి అసలు మాట్లాడటమే లేదు. మరో రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ రాయలసీమకు న్యాయ రాజధానిని స్వాగతిస్తున్నారు.
అయితే గుంటూరులో జరిగిన బిజెపి కోర్ కమిటీ సమావేశంలోనూ నేతలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలా? వద్దా? అన్న విషయంపై కొందరు నేతలు జోక్యం చేసుకోవాలనీ, మరి కొందరు చేసుకోరాదని వాదించినట్లు సమాచారం. జివిఎల్ నర్శింహరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయాన్ని తెలియజేయగా రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్, మాజీ ఎంపి దగ్గుబాటి పురందీశ్వరి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కేంద్రం జోక్యం చేసుకోవాలని వాదించినట్లు తెలుస్తోంది. భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినప్పటికీ కోర్ కమిటీలో అమరావతి రాజధానిగా కొనసాగించాలని తీర్మానం చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై పోరాటానికి దిగాలని కొందరు నేతలు ప్రతిపాదించారని సమాచారం.