ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార వై సీ పీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు యుద్ధం ఒక పక్క జరుగుతుండగా, రాష్ట్రంలో బీ జే పీ స్టాండ్ ఏమిటి? ఎలా వ్యవహరిస్తోంది? అన్న చర్చ సాగుతున్నది. ఇటీవల కాలం వరకు అధికార పక్షం వై సీ పీపై, జగన్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తూ వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్మినారాయణ ను పార్టీ అధిష్టానం తప్పించి సోము వీర్రాజుకు పార్టీ పగ్గాలు అప్పగించిన తరువాత అయన స్టైల్ లో అయన వెళుతున్నారు.
కన్నా లక్ష్మీనారాయణ బీ జే పీ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో రాజధాని అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలకు మద్దతుగా మాట్లాడటమే కాక రాజధానిని అమరావతిలోనే కొనసాగాలని తీర్మానం కూడా చేయించారు. అయితే సోము వీర్రాజు పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత అమరావతి రాజధాని అంశంపై అయన ఉద్దేశం ఏమిటో స్పష్టం చేయలేదు. ఈ సమస్య కు టీ డీ పీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణం అంటూ సోము వీర్రాజు విమర్శించారు. పార్టీ అధ్యక్షుడుగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం సందర్భంలో ఆ పార్టీ నేతలు రాష్ట్రలో పార్టీ బలోపేతానికి ప్రభుత్వం చేపట్టే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తామని ప్రకటించారు.
సోము వీర్రాజు భాద్యత చేపట్టిన తరువాత ఒకటి రెండు విషయాల్లో ప్రభుత్వానికి సూచనలు మాదిరిగా ప్రకటనలు విడుదల చేశారే తప్ప ప్రత్యక్ష కార్యక్రమాలకు పూనుకోలేదు. జనసేనతో కలసి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సోము వీర్రాజు పోరాటం ప్రారంభించక పోవడంపై ఇటు బీజేపీ, అటు జనసేన శ్రేణులు అసంతృప్తితో ఉన్నారట. అమరావతి రైతుల ఉద్యమం ప్రారంభమై 250 రోజులు దాటిన సందర్భంలోనూ సోము వీర్రాజు పల్లెత్తు మాట మాట్లాడలేదు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్నా ప్రభుత్వ చర్యలను ప్రశ్నించిన దాఖలాలు లేవు.
ఒక పక్క జనసేనతో పొత్తు, మరో వైపు సోము వీర్రాజును పార్టీ అధ్యక్షుడుగా ఎంపిక చేయడం వల్ల కాపు సామాజిక వర్గం బీజేపీకి కాపు కాస్తుందని కమలనాధులు ఆశించినప్పటికీ ప్రస్తుతం సోము వీర్రాజు వ్యవహరిస్తున్న తీరు కారణంగా అది నెరవేరేలా లేదని అనుకుంటున్నారట. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి సోము వీర్రాజు రానున్న రోజుల్లో ఏవిధంగా పావులు కడుపుతారు? రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా తయారు చేయడంలో సఫలీకృతులు అవుతారా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.