ప్రజా జీవితంలో మీడియా పాత్ర ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీడియా ఒక దశను దాటి వెబ్ మీడియా, సోషల్ మీడియా అనే స్థాయికి చేరుకుంది. సోషల్ మీడియాలో వచ్చే వార్త లు అన్ని నిజం కావు , అలాగని పూర్తిగా అబద్ధాలు కావు. అనేక పుకార్లు వార్తలుగా ధారాళంగా వ్యాపిస్తూ ఉంటాయి. అయితే యువతపై18 నుంచి 35 ఏళ్ల మధ్య ఓటర్లపై ఈ సామాజిక మాధ్యమాల ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో వచ్చే వార్తలను విపరీతంగా నమ్ముతూ షేర్ చేసుకుంటారు. ఈ విషయాన్ని అన్ని పార్టీల కంటే ముందే పసిగట్టిన వైసీపీ 2015 లోనే ప్రత్యేకంగా సోషల్ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నది. తద్వారా 2019 ఎన్నికల నాటికి దక్షిణ భారతదేశంలో అత్యంత బలమైన సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్న పార్టీగావైసీపీ నిలిచింది. అలా ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు సైనికుల్లా పని చేసి వైసీపీ పై జగన్ పై సానుకూల ప్రచారం చేస్తూ టిడిపి వ్యతిరేక ప్రచా రాలను విపరీత దశకు తీసుకువెళ్లారు. ఇది ఎన్నికలలో ఆ పార్టీకి ఎంతో కొంత లబ్ది చేకూర్చింది. వైసీపీకి ప్రతి మండలానికి కనీసం ఇద్దరు ముగ్గురు సోషల్ మీడియా యాక్టివ్ కార్యకర్తలు ఉన్నారు. వారికి ప్రత్యేక శిక్షణ తో పాటు గుర్తింపు కార్డులు కూడా ఉన్నాయి. అందుకే ఈ వ్యూహాన్ని ఇప్పుడు మరి కొన్ని పార్టీలు కూడా అమలు చేసే దిశగా ముందుకు వెళుతున్నాయి.
ప్రత్యేక ఛానల్ పెట్టేసిన తెలుగుదేశం పార్టీ
తెలుగుదేశం పార్టీకి ఇప్పుటి వరకు అనేక ఛానల్ లు అనుకూలంగా ఉన్నాయి. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా అనేకం తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు నారా లోకేష్ స్వీయ పర్యవేక్షణలో ప్రత్యేకంగా టిడిపి అఫిషియల్ అనే ఛానల్ రూపుదిద్దుకుంది. గడచిన నెల రోజుల నుంచి ఈ ఛానల్ కార్యకలాపాలు చురుకుగా జరుగుతున్నాయి. ఇది ఎన్నాళ్ళ నుండో ఉన్నప్పటికీ నెల రోజుల నుంచి మాత్రమే చురుకుగా కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు. దీన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఇప్పటికే జిల్లా స్థాయి, నియోకవర్గస్థాయి నుండి పార్టీ యువ నాయకులను రిపోర్టర్ గా తీసుకుని పార్టీ సమాచారాన్ని, క్షేత్రస్థాయి సమాచారాన్ని ఈ ఛానల్ లో ప్రసారం చేసే లాగా శిక్షణ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆగస్టు నెలాఖరు నుంచి 175 నియోజక వర్గాల స్థాయిలోనూ ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు. దీనికి లోకేష్ పూర్తి స్థాయి సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్నారు. దీనితో పాటు టెలిగ్రామ్ లో అధికారకంగా ఐదు గ్రూప్ లు నిర్వహిస్తూ, వాట్సప్ లో దాదాపు 250 గ్రూప్ లు నిర్వహిస్తూ ప్రతి గ్రూపు లోనూ పార్టీల అత్యంత కీలకంగా ఉండే లోకేష్ టీమ్ సభ్యుడు ఒకరు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ పార్టీలో ఆ గ్రూపులో కార్యకర్తలు నాయకులు ఉండేలా చూసుకుంటూ క్షేత్ర స్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని వైసిపి వ్యతిరేకతను ప్రచారం చేసి దాన్ని ఇతర గ్రూపులోకి వ్యాప్తి చేసేలా ప్రణాళికలు వేసుకున్నారు.
ఇదే తరహాలో బిజెపి కూడా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుతానికి ఎవరు అనేది సస్పెన్స్ గా నిలిచింది. కన్నా లక్ష్మీనారాయణ ను మారుస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన తప్పించి వేరే వాళ్ళని అధ్యక్షులుగా నియమిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం కానీ ఒక వేళ కన్నా నే మళ్లీ ఏపీ బిజెపి అధ్యక్షుడు గా కొనసాగితే మాత్రం ఆయన బృందం సోషల్ మీడియాలో చురుకుగా ఉండేందుకు ఇప్పటికే తెరవెనుక కసరత్తులు ప్రారంభించింది. సొంతంగా యూట్యూబ్ ఛానల్, ఫేస్ బుక్ పేజీలు ఏర్పాటు చేసుకొని వాటిలో కొంత మందిని కంటెంట్ రైటర్ లుగా రిక్రూట్ చేసుకునే పనిలో ఉన్నారుట. జిల్లాల వారీగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కంటెంట్ రైటర్ లను తీసుకొని బిజెపి భావాల పట్ల ఆకర్షితులుగా ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేసుకుని వారికి శిక్షణ ఇచ్చి నెల నెల కనీస వేతనం ఇచ్చి ఎన్నికల నాటికి వారిని కీలకంగా తయారు చేయాలని బిజెపి కూడా ప్రణాళికలు తయారు చేస్తుందట. ఇలా వై ఎస్ ఆర్ సీపీ సోషల్ మీడియాను ఆదర్శంగా తీసుకుని తెలుగు దేశం, బిజెపి, జనసేన పార్టీ లు సోషల్ మీడియా ప్రభావాన్ని తెలుసుకొని ఆ దిశగా పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం అయితే వైసీపీ సోషల్ మీడియానే బలంగా ఉంది. జగన్ వ్యతిరేక ప్రచారాన్ని వెంటనే తిప్పి కొట్టి, చంద్రబాబు లోకేష్ కి వ్యతిరేకంగా వ్యాప్తిని చాలా వేగంగా తీసుకొని వెళ్తుంటారు. అదే స్థాయిలో తెలుగుదేశం పార్టీ కూడా కసరత్తు చేస్తోంది. సిఎం జగన్ కు వ్యతిరేకంగా పోస్టింగులు పెట్టడం వాటిని సాధ్యమైనంత ఎక్కువ మందికి చేర్చడం ద్వారా సక్సెస్ అవుతామని భావిస్తోంది. సోషల్ మీడియాలో ఎవరి ఎత్తులు, ఎవరి ప్రణాళికలు ఫలిస్తాయి అనేది వచ్చే ఎన్నికల నాటికి తెలిసిపోతుంది.