గుంటూరు: శ్రీవారి బంగారం తరలింపులో బ్యాంకు అధికారుల నిర్లక్ష్యాన్ని టిటిడి బోర్డుకు, ప్రభుత్వానికి ఆపాదించి వైసిపి రాక్షసానందం పొందుతుందని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య విమర్శించారు.
గుంటూరులోని టిడిపి కార్యాలయంలో ఆనంద్ సూర్య మంగళవారం మీడియాతో మాట్లాడారు. టిటిడి పవిత్రను దెబ్బతీసే విధంగా వైసిపి పలు కుట్రలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. కేంద్రం ఆడిస్తున్న కుట్రలో వైసిపి ఒక పావు మాత్రమేనని ఆనంద్ సూర్య పేర్కొన్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి మరోసారి విజయభేరి మోగిస్తుందనీ, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావటం తథ్యమనీ ఆనంద్ సూర్య ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల వేళ తమిళనాడులో భారీగా పట్టుబడ్డ బంగారంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తిరపతికి ఈ బంగారాన్ని తరలిస్తున్న సమయంలో ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఆధారాలు చూపించడంతో ఆ బంగారాన్ని టిటిడికి అప్పగించారు. ఈ వ్యవహారంపై నిన్న ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కూడా వివరణ ఇచ్చారు.