AP Cabinet: ఏపీ క్యాబినెట్ సమావేశం నిర్వహణకు ప్రభుత్వం సమయాత్తమవుతోంది. జనవరి 21న జరగబోయే క్యాబినెట్ సమావేశం దాదాపు రెండు నెలల తర్వాత జరుగబోతోంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల తర్వాత జరుగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. మరో రెండు నెలల్లో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. గతేడాది అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టని ప్రభుత్వం ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సమయాత్తమవుతోందని తెలుస్తోంది. ఇది మాత్రమే కాకుండా.. ప్రస్తుతం రాష్ట్రంలోని సమస్యలు, కరోనా కేసులు, సినిమా టికెట్ల వివాదం, ఉద్యోగుల పీఆర్సీ అంశం, ఇటివలి జగన్ ఢిల్లీ పర్యటన విశేషాలు క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అనేక అంశాలతో..
ఈసారి (AP Cabinet) అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానుల అంశానికి చెందిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. పాత బిల్లును వెనక్కి తీసుకున్న ప్రభుత్వం ఈసారి అందరికీ ఆమోదయోగ్యమైన బిల్లును ప్రవేశపెడతామని చెప్పడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉద్యోగులకు 23 శాతం పీఆర్సీ ప్రకటించగా ఉద్యోగ సంఘాలు కొంత ఏకీభవించినా.. ఉద్యోగుల నుంచి కొంత వ్యతిరేకత ఉంది. సచివాలయ సిబ్బంది కూడా తమ ప్రొబేషనరీపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశపై కూడా క్యాబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఇటివల సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చే వివరాలపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
బడ్జెట్ నేపథ్యంలో..
ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ కరోనా పరిస్థితులు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. పరిస్థితుల దృష్ట్యా కోవిడ్ నిబంధనలు, మందులు, వ్యాక్సినేషన్, ఒమిక్రాన్, సిబ్బంది, ఆంక్షలపై తీసుకోవాల్సిన జాగ్రత్తపై కూడా క్యాబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు ఇటివల సీఎం జగన్ ఢిల్లీ పర్యటన విశేషాలు, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాల్ని కూడా క్యాబినెట్ లో మంత్రులతో చర్చిస్తారని తెలుస్తోంది. దీంతోపాటు (AP Cabinet) క్యాబినెట్లో ఆమోదించేందుకు అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు వివరాలు తీసుకోనుంది. మొత్తంగా ఈసారి క్యాబినెట్ సమావేశంలో అనేక కీలకాంశాలపై సమీక్ష జరుగనుంది.