ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గ మార్పులకు ముహూర్తం ఫిక్స్ అయింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 22న అంటే ఎల్లుండి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది. సచివాలయ వర్గాల సమాచారం మేరకు రామచంద్రపురం ఎమ్మెల్యే శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, అలాగే శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే అప్పలరాజు ఇద్దరికి కొత్తగా మంత్రులుగా అవకాశం ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో మంత్రి పదవి కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త మంత్రులుగా అనేక మంది పేర్లు వినిపించినా, సీఎం జగన్.. ఆచి చూసి అడుగులు వేసి ఏ సామాజిక వర్గాలు మంత్రులు అయితే మంత్రి వర్గం నుంచి బయటకు వెళ్తున్నారో అదే సామాజిక వర్గానికి చెందిన వారిని లోపలకు తీసుకుంటున్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే అప్పలరాజు వృత్తి రీత్యా వైద్యుడు. ఐదేళ్లుగా రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికి ఆయనకు అనేక అంశాలపై పట్టు ఉండడం, శాసనసభలో కూడా పార్టీ విధానాలకు తగ్గట్టు సున్నితమైన అంశాలతో సూటిగా మాట్లాడటం, ప్రతిపక్షంను కూడా ఇరుకున పెట్టే వాక్చాతుర్యం ఉండటంతో ఆయనను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో మోపిదేవి వెంకటరమణ మాదిరిగానే ఆయన కూడా మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వారు. అందుకే ఆయన ఎంపిక వివాదరహితంగా ఉంటుందని జగన్ భావించి ఉండవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే బిసి సామాజిక వర్గానికి చెందిన నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ మంత్రివర్గంలో ఉన్నారు. తాజాగా అప్పలరాజు ను మంత్రి వర్గం లోకి తీసుకుంటే ఆ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు చేరినట్టు అవుతుంది. అయితే శ్రీకాకుళం జిల్లా చిన్నది కావడం 10 శాసనసభ స్థానాలకే ఇద్దరు మంత్రులను ఎంపిక చేస్తారా లేదా అనేది సందేహం నెలకొంది. ప్రస్తుతానికైతే చిదిలి అప్పలరాజు పేరు ఖరారు అయినప్పటికీ పార్టీ ఉన్నతస్థాయి వర్గాలు, సీఎం జగన్మోహన్ రెడ్డి నుండి ఇంకా ద్రువీకరించకపోవడంతో చివరలో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు.
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే వేణుగోపాల కృష్ణది వివాద రహిత ప్రస్థానం. ఆయన కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వివాదరహితుడు కావడం, నియోజకవర్గంలో మంచి పేరు ఉండటం, జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండటంతో ఆయనను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో మరీ ముఖ్యంగా కోనసీమలో ఈ సామాజిక వర్గానికి మంచి పట్టు ఉంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు వెళితే ఆ స్థానాన్ని, ఆ రాజకీయ ప్రస్థానాన్ని భర్తీ చేసేందుకు వీలుగా వేణుగోపాల కృష్ణ కు సీఎం జగన్ అవకాశం ఇచ్చారని అంటున్నారు. అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. వేణుగోపాల కృష్ణ కు ఆ అవకాశం ఇస్తారో లేదో ప్రస్తుతానికి తెలియదు. అయితే బిసి సామాజిక వర్గానికి చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు లేదా ధర్మాన కృష్ణదాస్ లలో ఒకరికి ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి కల్పించే అవకాశం ఉందని అంటున్నారు.ఇవి సచివాలయంలో అనధికార వర్గాలు అందించిన సమాచారం మాత్రమే. పార్టీలో ఉన్నతస్థాయి వర్గాలు వద్ద సీఎం జగన్ ప్రస్తుతానికి ఖరారు చేయలేదు. ఆయన ధ్రువీకరించిన తర్వాత ఈ పేర్లు ఖరారు అవుతాయి. ఏది ఏమైనప్పటికీ ఎల్లుండి మధ్యాన్నం ఒంటి గంట తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?