ఢిల్లీ, జనవరి 8: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఢిల్లీలోని రాహుల్ నివాసానికి చేరుకున్న సీఎం ఆయనతో సమావేశమయ్యారు.
భాజపా వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలను ఏకం చేయాలనే లక్ష్యంతో గతేడాది డిసెంబర్ తొమ్మిదిన ఢిల్లీలో సుమారు 28 రాజకీయ పార్టీలతో జరిగిన భేటీకి కొనసాగింపుగా చంద్రబాబు మంగళవారం ఢిల్లీ పర్యటన చేపట్టారు.
రాహుల్తో భేటీ అనంతరం ఎన్ సిపి అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరితో చంద్రబాబు సమావేశం అయ్యారు.
ఈ నెల 19న కోల్కత్తాలో బహిరంగ సభ తర్వాత దేశవ్యాప్తంగా నిర్వహించే భారీ ర్యాలీలపై నేతలతో చర్చిచారు. భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి? జనవరి 19 తర్వాత ఎక్కడ ఎలాంటి సమావేశాలు పెట్టాలి? ఎవరు ఎక్కడ హాజరు కావాలి? ఆయా చోట్ల ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలేమిటి? తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
జాతీయ నేతలతో భేటీ అనంతరం చంద్రబాబు టిడిపి ఎంపీలతో సమావేశం అయ్యారు.