(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సి)ని రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తిలేదని ప్రకటించిన సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆ మేరకు ఎన్ఆర్సిని వ్యతిరేకిస్తూ రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదిస్తారా? లేదా? అనేది అశక్తికరంగా మారింది. ఎన్ఆర్సికి పార్లమెంట్లో వైసిపి ఎంపిలు అనుకూలంగా ఓటు వేసిన నేపథ్యంలో గత డిసెంబర్ నెలలో పెద్ద సంఖ్యలో ముస్లింలు ఏపి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కడపలో డిప్యూటి సిఎం అంజద్ బాషా నివాసాన్ని ముట్టడించారు. ఈ సందర్భంలో ఎన్ఆర్సిని అన్ని ఫార్మెట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందనీ, ఇది తన వ్యక్తిగత అభిప్రాయం కాదనీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు ఈ ప్రకటన చేస్తున్నామనీ డిప్యూటి సిఎం అంజాద్ బాషా తెలిపారు.
అనంతరం ముఖ్యమంత్రి జగన్ కూడా కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపనకు వెళ్లిన సమయంలో డిప్యూటి సిఎం అంజద్ బాషా ప్రభుత్వ వైఖరిని వెల్లడించారనీ, తనతో సంప్రదించిన తరువాతే ఆయన ఆ ప్రకటన చేశారని జగన్ చెప్పారు. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదిని ఆ తరువాత ఒక రోజు వ్యవధిలో హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి వచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి పలు అంశాలతో పాటు మండలి రద్దు బిల్లును ఆమోదించాలని కోరుతూ వినతి పత్రాన్ని మోది, షాలకు అందజేశారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించేందుకు ఎన్డిఎలో భాగస్వామ్యం అవ్వనున్నదంటూ పుకార్లు షికారు చేశాయి. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించేందుకే జగన్ మోదిని కలిశాడంటూ సోషల్ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. అయితే ఇప్పటి వరకూ వైసిపి.. అధికారికంగా కేంద్రంతో కలవనున్నట్లుగా కానీ, దూరంగా ఉంటామనీ కానీ ప్రకటించలేదు. మంత్రి బొత్సా సత్యనారాయణ మాత్రం తన మాటలను ఈనాడు పత్రిక వక్రీకరించిందని ఖండించారు.
ఈ పరిస్థితుల్లో సిఎఎ, ఎన్ఆర్సి, ఎన్పిఆర్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేయాలనీ, దీనికి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ఇవ్వాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్ డిమాండ్ చేశారు. అటు పక్క తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సిఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఏపి అసెంబ్లీలో సిఏఏ, ఎన్ఆర్సిలకు వ్యతిరేకంగా తీర్మానం పెట్టకపోతే రాజీనామా చేస్తామని డిప్యూటి సిఎం అంజద్ బాషా, గుంటూరు వైసిపి ఎమ్మెల్యే ముస్తఫాలు సంచలన ప్రకటన చేశారు. ఎన్ఆర్సి విషయంలో కేంద్రం కూడా వెనక్కు తగ్గే ప్రశక్తి లేదని చెబుతున్నది. కేంద్రంతో సఖ్యతగా ఉంటూ తన పనులు చక్కబెట్టుకోవాలని భావిస్తున్న సిఎం జగన్మోహనరెడ్డి ఇప్పుడు దీనిపై ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.