అమరావతి : ఇసుక పాలసీపై గుంటూరు జిల్లా వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇసుక నూతన విధానంపై గుంటూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఇసుక అక్రమాలపై ఘాటైన విమర్శలు చేయడం వివాదాస్పదం అయ్యాయి.
రీచ్లో లోడింగ్ అయిన ఇసుక లారీ డిపోకు వచ్చే సరికి మాయమైపోతోందనీ, అసలు ఇది ఎలా జరుగుతుందో అర్థం కావడం లేదని అయన సంచలన వ్యాఖ్యలు చేశారుట. ఒక్క పల్లెటూరులో కూడా బొచ్చెడు కాదు కదా దోసెడు ఇసుక కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందనీ, అధికారులకు చెప్పినా ఉపయోగం లేకుండా పోయిందని బ్రహ్మనాయుడు వాపోయారుట. ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చినా ఇసుక విషయానికి వచ్చేసరికి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనీ, జిల్లాలో నాడు-నేడు, ఉపాధి హామీ పనులకు కూడా ఇసుక సరఫరా చేయలేని పరిస్థితి నెలకొందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారని తెలుస్తోంది. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినా ఇసుక విషయానికి వచ్చేసరికి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని బ్రహ్మనాయుడు అనడం కొందరు అధికార పార్టీ నేతలకు మింగుడు పడలేదుట.
వెంటనే బ్రహ్మయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్ది దృష్టికి తీసుకునివెళ్ళారుట. అయితే బ్రహ్మయ్యనాయుడు వ్యాఖ్యలపై సీఎం వైఎస్ జగన్ పాజిటివ్ గా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. స్థానికంగా జరుగుతున్న ఇసుక దందా గురించి అధికారులతో మాట్లాడారు అని టాక్.