(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అబ్బో జగన్ వ్యూహం అదుర్స్. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను హైకోర్టు తప్పు పట్టిన నేపథ్యంలో జగన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేసారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. అందుకే చట్టాలను అవపోసనపట్టిన వ్యక్తికే పదవి కట్టపెట్టారన్న మాట వినిపిస్తుంది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఆ పదవి నుండి తప్పించేందుకు పెద్ద కసరత్తే చేసినట్లు కనబడుతోంది. పదుల సంఖ్యలో సలహాదారులు ఉన్నప్పటికీ జగన్ ఎవరి సలహాలు తీసుకోరని, ఎవరి మాటలు వినరని, ఆయనకు సలహా ఇచ్చే ధైర్యం ఎవరికి లేదని, ఆయన అనుకున్నదే చేస్తారని ఇప్పటి వరకు ప్రచారంలో ఉంది.
రాష్ట్ర ప్రభుత్వానికి మాట మాత్రంగా కూడా చెప్పకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం సిఎం జగన్మోహన్ రెడ్డికి ఆగ్రహం తెప్పించిన విషయం విదితమే. దీనితో ఆయనను ఎలా సాగనంపాలనే దానిపై తీవ్ర కసరత్తు చేశారు. మాజీ ఎన్నికల అధికారి రమాకాంత రెడ్డి, రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ తదితర మేధావుల తో జగన్ చర్చించారని సమాచారం.
ఇంకా మరో ఏడాది పదవీ కాలం ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను తొలగించే ప్రక్రియ ప్రారంభిస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని భావించి రహస్యంగా చేయాలిసిన పనులను చేసేశారు. అందరూ కరోనా గోలలో ఉండగా విషయం ఏమాత్రం బయటకు పొక్కకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని మూడేళ్ళ కు కుదిస్తూ ఆర్డినెన్సు తీసుకురావడంతో పాటు వెను వెంటనే నూతన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా న్యాయకోవిదుడైన తమిళనాడు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కానగరాజ్ ను నియమించడం, ఆయన వెంటనే బాధ్యతలు స్వీకరించడం కూడా జరిగి పోయాయి.
అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే గతంలో ఎన్నడూ లేని విధంగా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులకు ఎస్ఈసి పదవికి రిజర్వేషన్ కల్పించడం. ఇది న్యాయమూర్తులుకు సంతోషం కల్గించే విషయం. ఇప్పటి వరకు రిటైర్డ్ ఐఏఎస్ లను మాత్రమే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ లుగా నియమితులు అవుతూ వచ్చారు. జగన్ కొత్త సంప్రదాయాన్ని తీసుకొని రావడంలో ఆంతర్యం జగన్నాధుడికే తెలియాలి.
జరగాల్సిన తతంగం అంతా పూర్తి అయింది. ఇప్పుడు ఎస్ ఈ సి పదవి కోల్పోయిన రమేష్ కుమార్ హైకోర్టు ను ఆశ్రయించారు. చూడాలి ఏమిజరుగుతుందో.