ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలు రాజుకుంటున్నాయి. విభజన సమయం నుంచీ ఉన్న సమస్యలకు కొత్త ప్రాజెక్టుల విషయంలో వస్తున్న సమస్యలను ఇద్దరు సీఎంలు ఓ కొలిక్కి తీసుకురావడం లేదు. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల ప్రాజెక్టును తెలంగాణ వ్యతిరేకిస్తోంది. కేంద్రం కూడా ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్లొద్దని ఏపీకి లేఖ రాసింది. అపెక్స్ కౌన్సిల్ లో తీసుకున్న నిర్ణయాలు ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించింది. దీనికి సీఎం జగన్ కేంద్ర మంత్రికి ఘాటుగా లేఖ రాశారు. ఏపీలో చేపడుతున్న ప్రాజెక్టులు కొత్తవి కాదని.. గతంలోనే ప్రతిపాదించినవని రాశారు. మా వాటా జలాలనే మేము వాడుకుంటున్నామని కూడా రాశారు. ఇంతకీ జగన్ రాసిన లేఖలో ఏముందంటే..
కేంద్రమంత్రికి జగన్ రాసిన లేఖ సారాంశమిదే..
‘రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై ఏపీ స్పందన లేదంటూ ఈనెల 7న కేంద్రం రాసిన లేఖ సరికాదు. సమావేశంలో రాష్ట్రం తరఫున మాట్లాడేందుకు అజెండా కూడా ఖరారు చేశాం. కృష్ణా ట్రైబ్యునల్ ఇచ్చిన నీటి వాటాకు బద్ధులై ఉంటామని తెలంగాణ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చెప్పింది. కేంద్రం రాసిన లేఖలో ప్రస్తావించిన ప్రాజెక్టులు ఏపీలో కొత్తవి కాదు. కృష్ణా ట్రిబ్యునల్ కేటాయింపుల ఆధారంగానే ప్రాజెక్టులు ఉన్నాయి. 2015లో కేఆర్ఎంబీ సమావేశంలోనూ తెలంగాణ, ఏపీ మధ్య అంగీకారం కుదిరింది. కృష్ణా నదీ నీటి పంపకాల్లో తెలంగాణ, ఏపీ మధ్య ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుతో ఉన్న ప్రాజెక్టులకు నీటిని అందించడంతో పాటు సమర్థంగా కాల్వల వ్యవస్థను వినియోగించుకోవడమే జరుగుతుంది. దీని వల్ల ఎలాంటి అదనపు ఆయకట్టు సాగులోకి రాదు’.
‘నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరగదు. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన నీటి వాటా వినియోగానికే ఎత్తిపోతల ప్రాజెక్ట్. కృష్ణా నదిపై తెలంగాణ చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, దిండి ఎత్తిపోతలకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలై ఉంది. ఆ రెండు ప్రాజెక్టులు తెలంగాణలో కొత్త కాల్వ వ్యవస్థను, ఆయకట్టును సృష్టిస్తున్నాయి. ఈ నిర్మాణాలను నిలుపుదల చేయాల్సిందిగా అపెక్స్ కౌన్సిల్ తెలంగాణను ఆదేశించలేదు. రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనైనా ఈ అంశాలు పరిష్కారమవుతాయని భావిస్తున్నాం’ అని జగన్ తన లేఖలో ప్రస్తావించారు. గడచిన ఆరేళ్లలో ఇవే వివాదాలు నడుస్తున్నాయి. మరి ప్రస్తుతం ఇవి ఎలా టర్న్ తీసుకుంటాయో చూడాల్సి ఉంది.