AP CM Office: వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ తీసుకున్న అతి పెద్ద నిర్ణయం మూడు రాజధానులు/ రాజధాని వికేంద్రీకరణ..! ఎందుకంటే పరిపాలన/ అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితమవ్వకూడదు. అన్ని ప్రాంతాల్లో కేంద్రీకృతమవ్వాలి..! సీఎం జగన్ కి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలంటే అంత మక్కువ.
సీఎం జగన్ క్యాబినెట్ లో అన్ని సామజిక వర్గాల మంత్రులున్నారు. ఎస్సి, బీసీ, మైనారిటీ, కాపులు, రెడ్డిలు, కమ్మ, ఆర్యవైశ్య అందరూ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి హోదా కూడా ప్రాంతాల వారీగా, సామజిక వర్గాల వారీగా ఇచ్చారు. సీఎం జగన్ కి అన్ని సామాజికవర్గాలన్నా, ప్రాంతాలన్నా అంత మక్కువ.
మొన్న నెలలో ప్రకటించిన కార్పొరేషన్లలో అన్ని సామజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు. వందలాది పదవులు సృష్టించి సామాజికవర్గాల వారిగా.., జిల్లాల వారీగా నాయకుల హోదా ఆధారంగా జాగ్రత్తగా డీల్ చేసి పంచిపెట్టారు. వందలాది మందికి ఒకేసారి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. సీఎం జగన్ కి ప్రాంతాలన్నా, సామాజికవర్గాలన్నా, పార్టీ నేతలన్నా అంత మక్కువ..!
కానీ ఈ మూడు రాజధానుల పరిపాలనను.., మంత్రుల పనితీరుని.., మంత్రుల మాటతీరుని.., నామినేటెడ్ పదవుల్లో ఉన్న నాయకుల ప్రవర్తన/మాటలు/ పనితీరుని ఒకవిధంగా మొత్తం రాష్ట్రాన్ని శాసిస్తున్న సీఎం ఆఫీస్ లో మాత్రం ప్రాంతాలు, సామాజికవర్గాలు మరిచారు. కేవలం తన ప్రాంతం, తన జిల్లా, తన నియోజకవర్గం ఉండేలా చూసుకున్నారు. అంటే మంత్రులు, పదవులు, ప్రాంతాలు, పరిపాలన మొత్తం పులివెందుల చేతికి వెళ్ళినట్టే… ఇది జగన్ కి లాభమా..? నష్టమా..!?
AP CM Office: సీఎం ఆఫీస్ లో ఎవరెవరు – ఏ ఏ హోదాల్లో..!?
సీఎం కార్యాలయంలో జగన్, ఆయన భార్య భారతీరెడ్డిల పెత్తనం వరకు పర్వాలేదు. వారిద్దరూ, వారికి ఆ ప్రాంతం వారూ అన్నట్టు మారింది. జగన్ పీఏ కె.ఎన్నార్ పులివెందుల ప్రాంతానికి చెందిన వారు. పరిపాలన వ్యవహారాల్లో ఆయనదే కొంత పెత్తనం ఉంది. పోలీసు నియామకాలు, బదిలీలు, పోస్టుల విషయంలో కేఎన్నార్ పెత్తనంపై పార్టీలో అంతర్గచ చర్చ నడుస్తుంది. సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి.. పులివెందుల ప్రాంతానికి చెందిన వ్యక్తి. సీఎం జగన్ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే ఈ పోస్టులోకి ఈయన వచ్చారు. ఇక సీఎం జగన్ అదనపు కార్యదర్శి కె. ధనుంజయరెడ్డి.. ఈయన కూడా కడప జిల్లా పులివెందుల సమీప ప్రాంతానికి చెందిన వారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈయన సర్పంచిగా పని చేసారు. పులివెందులలోని ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థకి డైరెక్టర్ గా కూడా విధులు నిర్వర్తించారు. ఐఎఎస్ హోదా వచ్చిన తర్వాత శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా, టూరిజం కార్పొరేషన్ ఎండీగా పని చేసారు. జగన్ సీఎం అయినా రోజునే ఈయన అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు.
* ఇక సీఎం ఆఫీస్ లో రాజకీయ, పరిపాలన పెత్తనాల్లో సీఎం తర్వాత స్థానంలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిది పులివెందుల పక్కనే ఉన్న సింహాద్రిపురం. ఈయన చదివింది, పెరిగింది అంతా పులివెందులలోనే… ప్రభుత్వంలో ప్రస్తుతం రాజకీయ, పరిపాల పెత్తనాల్లో సజ్జల పాత్ర అందరికీ తెలిసిందే. సాక్షి పత్రిక ఎడిటోరియల్ ఇంఛార్జిగా, సాక్షి జర్నలిజం పాఠశాల ప్రిన్సిపాల్ గా ఉన్న ఈయన వైసీపీలో తెరవెనుక కీలక పాత్రలో పని చేసారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎవరూ ఊహించని స్థాయిలో నంబర్ టూలో ఉన్నారు. ఇక స్పెషల్ బ్రాంచి రవి శంకర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ రాజేంద్ర నాధ్ రెడ్డిలు కూడా కడప జిల్లా పులివెందుల సమీపస్థులే.
ఏం సందేశమిస్తున్నట్టు..!?
ప్రభుత్వంలో.., తన మంత్రివర్గంలో.., తన రాజకీయ టీమ్.., తన పార్టీ నామినేటెడ్ పదవుల్లో అన్ని ప్రాంతాలకు, సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చిన సీఎం జగన్ రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకుని పరిపాలనలో కీలకమైన సీఎం కార్యాలయంలో మాత్రం ఎందుకో ఒకే ప్రాంతానికి పరిమితం చేశారు. బహుశా మొత్తం తనకు తెలిసిన వాళ్ళు, సన్నిహితులు ఉంటె తన నియంత్రణలోనే ఉంటుందని కావచ్చు. కానీ దీని వలన వచ్చే చెడ్డపేరు, దుష్పరిణామాలు జగన్ ఊహించలేదేమో. తమ హోదా, స్థాయిలను అడ్డం పెట్టుకుని సీఎంవోలోని జగన్ సొంత టీమ్ లో కొందరు రాష్ట్రంలో అనధికార చక్రం తిప్పుతున్నారు. కీలక వ్యవహారాల్లో వేలు పెడుతున్నారు. సీఎం కి తెలియకుండా.. ఆయన చిన్న అంశాలు అనుకునే అనేక బదిలీలు, పోస్టింగులు, ఇతర ప్రైవేట్ సెటిల్మెంట్ వ్యవహారాల్లో అనధికారికంగా తల దూరుస్తున్నారు. కొన్ని శాఖల్లోని అధికారులను దారిలోకి తెచ్చుకుని ఒత్తిళ్లకు గురి చేస్తూ తమ సొంత పనులు కానిచ్చుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పూర్తిగా సీఎం కార్యాలయం పర్యవేక్షణ, నియంత్రణలో ఉండే “ముఖ్యమంత్రి సహాయ నిధి” విభాగంలో గత ఏడాది జరిగిన రూ. 117 కోట్ల కుంభకోణం దీనికి నిదర్శనం. ఇలా బయటకు రానివి కొన్ని ఉండవచ్చనేది ఓ వర్గం వాదన. జగన్ కి తెలిసి జరుగుతుందో, తెలియక జరుగుతుందో కానీ.. ఇది గుర్తించలేని నష్టం కలిగిస్తుందని పరిశీలకులు పేర్కొంటున్నారు..!