ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకునే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపుతున్న ప్రత్యేక శ్రద్దకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హాట్స్ ఆఫ్ చెబుతున్నారు.
ఇప్పటికే సంక్షేమ రంగాన్ని పరుగులు పెట్టిస్తూ లబ్ధిదారుల హృదయాలు గెలుచుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల జరిగిన పలు ప్రమాద సంఘటనల మృతుల కుటుంబాలకు ఎవరూ ఊహించనంతగా భారీగా పరిహారం ప్రకటిస్తూ తనదైన ముద్రను సొంతం చేసుకుంటున్నారు. దీనితో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో సహా ఇతర పార్టీలకు వాయిస్ లేకుండా పోతున్నది.
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అధికారం రాకముందు వరకు ఎక్కడైనా ప్రమాదం జరిగితే మృతుల కుటుంబాలకు రూ. 3లక్షల నుండి 5 లక్షల వరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుండేది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయంలో విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిపై పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు అడ్డరోడ్డు సమీపంలో దివాకర్ ట్రావెల్స్ బస్సు పల్టీ కొట్టిన ప్రమాదంలో 11మంది మృతి చెందారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధిత కుటుంబాలకు రూ. 3లక్షల నుండి రూ. 5లక్షల వరకు మాత్రమే పరిహారం అందించారు. చంద్రన్న భీమా ఉన్న వారికి 5లక్షలు, చంద్రన్న భీమా లేని వారికి 3లక్షలు, ఇతర రాష్ట్రాలకు వారికైతే కేవలం రెండు లక్షలు మాత్రమే పరిహారంగా ప్రకటించారు. ఇదే మాదిరిగా ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లోనూ ప్రమాద మృతుల కుటుంబాలకు అత్యధికంగా 5 లక్షల వరకు మాత్రమే పరిహారంగా ప్రకటిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత గత ఏడాది దేవీపట్నం వద్ద గోదావరి నదిలో బోటు మునిగిన ప్రమాదంలో 30మందికి పైగా మృతి చెందారు. ఈ సందర్భంలో సీఎం జగన్ బోటు ప్రమాద మృతుల కుటుంబాలకు పది లక్షల వంతున పరిహారం ప్రకటించారు.
ఇటీవల విశాఖ ఎల్జీ పొలిమార్స్ లో జరిగిన గ్యాస్ లోకేజీ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఏకంగా కోటి రూపాయల వంతున పరిహారం అందజేశారు. అదే మాదిరిగా నాలుగు రోజుల క్రితం విశాఖ షిప్ యార్డ్ లో జరిగిన క్రేన్ కుప్పకూలిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు యాజమాన్యంతో మాట్లాడి 50లక్షల చొప్పున పరిహారం, వారి కుటుంబాలలోని నిరుద్యోగులకు షిప్ యార్డ్ లో ఉద్యోగం హామీ ఇప్పించారు. తాజాగా విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 50లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఏపీలో ఇంత పెద్ద మొత్తంలో పరిహారాన్ని సీఎం జగన్ ప్రకటిస్తున్న విషయం తెలియని ప్రధాని నరేంద్ర మోడీ మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరపున 2లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
ఇక రెండు రోజుల క్రితం కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పది లక్షలు వంతున పరిహారం ప్రకటించింది. చూస్తున్నారుగా గత ప్రభుత్వాల హయంలో, ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి.ఇప్పుడు ఏపీలో జగన్ సర్కార్ భాదిత కుటుంబాలను ఆదుకునే తీరు.