ఈ నెల 15వ తేదీ నుండి ఏపి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అసెంబ్లీ బీఏసీ సభ్యులను నియమించారు. మంత్రివర్గ మార్పుల నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సభ్యులను సీఎం మార్చారు. మాజీ మంత్రులు కన్నబాబు, అనిల్ కుమార్ స్థానాల్లో బీఏసీ సభ్యులుగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్ లను నియమించిన సీఎం జగన్.. బీఏసీలో శాసనసభా వ్యవహారాల కోఆర్డినేటర్ గా గడికోట శ్రీకాంత్ రెడ్డి ని నియమించారు.
15వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి. సమావేశాలను ఎన్ని రోజుుల నిర్వహించాలనే దానిపై బీఏసీ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. అయిదు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించనున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఈ సమావేశాల్లోనే అత్యంత కీలకమైన మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాాచారం. మరో పక్క సమావేశాల్లో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సమాయత్తం అవుతుండగా, ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు అధికార పక్షం సిద్దం అవుతోంది.