అమరావతి: రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల కేటాయింపునకు ముఖ్యమంతి వైఎస్ జగన్ కసరత్తు ప్రారంభించారు. మంత్రివర్గంలో చోటు ఇవ్వలేకపోయిన ఎమ్మెల్యేలు, పార్టీ కోసం కష్టపడి పని చేసిన సీనియర్ నేతలకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు కట్టబెట్టేందుకు సిఎం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన టిటిడి చైర్మన్ పదవిలో సీనియర్ నేత, మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డిని నియమించారు. త్వరలో నియమించనున్న నామినేటెడ్ పదవులకు ఈ కింది నేతల పేర్లు దాదాపు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది.
ఎపిఐఐసి ఛైర్మన్గా నగరి ఎమ్మెల్యే రోజా, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్గా పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, సిఆర్డిఎ ఛైర్మన్గా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి,
ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్గా ప్రముఖ సినీ నటుడు మోహన్బాబు, ఆర్టిసి ఛైర్మన్గా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, కాపు కార్పోరేషన్ ఛైర్మన్గా గ్రంధి శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ పదవికి ద్రోణంరాజు శ్రీనివాస్, పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్గా యేసురత్నం, సివిల్ సప్లయిస్ కమిషన్ ఛైర్మన్గా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎస్సి కమిషన్ ఛైర్మన్గా మోషేన్ రాజు, వక్ఫ్ బోర్డు ఛైర్మన్గా మహ్మద్ ముస్తఫాలను నియమించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అదే విధంగా ఇతర ఛైర్మన్ పోస్టులను కూడా జగన్ భర్తీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. వీటితో పాటుగా భూమన కరుణాకర రెడ్డికి రాయలసీమ అభివృద్ది మండలి ఛైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇక టిటిడి పాలకవర్గ సభ్యులుగా అవకాశం ఇవ్వాలని పలువురు పార్టీ నేతలు సిఎం జగన్ను అభ్యర్దిస్తున్నారు. ఇప్పటికే బొల్లా బ్రహ్మనాయుడు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేర్లు జగన్ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తూర్పు గోదావరి నుండి రౌతు సూర్యప్రకాశ రావు లేదా తోట వాణిల్లో ఒకరికి అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు. గన్నవరం నుండి పోటీ చేసిన వెంకట్రావు సైతం తనకు అవకాశం ఇవ్వాలని జగన్ను కలిసి కోరారు. అనంతపురం నుండి మహిళా ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వనున్నారు. తెలంగాణ కోటాలో జూపల్లి రామేశ్వరరావు పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ సారి మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక నుండి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వవచ్చని భావిస్తున్నారు. పాలకవర్గ సభ్యుల లిస్టు సైతం త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.