అమరావతి : రాష్ట్రంలో ఏ ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు లేకుండా అనూహ్య మెజారిటీతో అధికారాన్ని హస్తం గతం చేసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్ది నేడు ఉన్న తలనొప్పులతో పాటు కొత్త తలనొప్పులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్నా కరోనా నేపథ్యంలో సంబరాలు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. మరో పక్క వివిధ పాలనాపరమైన అంశాలలో జగన్ ప్రభుత్వానికి హైకోర్టు నుండి వ్యతిరేక తీర్పులు తలనొప్పిగా మారాయి.
ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వ్యవహారంలో ఇటు హైకోర్టుతో పాటు అటు సుప్రీం కోర్టు నుండి వ్యతిరేక తీర్పులు వచ్చిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలో గతంలో ఏ ప్రభుత్వానికి జరగని విధంగా సుమారు 70 అంశాలలో హైకోర్టు తప్పు బట్టింది. ఇవి ఇలా ఉండగా మరోవైపు..పలువురు నేతలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు.
తొలుత ఆ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామరాజు పలు ప్రభుత్వ నిర్ణయాలు తప్పు పట్టారు. టీటీడీ భూముల వివాదం, నిమ్మగడ్డ వ్యవహారాలలో ఆయన మీడియా సమక్షంలో వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఇసుక అక్రమాలపై ఘాటైన విమర్శలు చేశారు. రీచ్లో లోడింగ్ అయిన ఇసుక లారీ డిపోకు వచ్చేసరికి మాయమైపోతోందని అధికారిక సమావేశంలో అనడం సంచలనం సృష్టించింది. తాజాగా..మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఏడాదిగా తన నియోజకవర్గాన్ని పాలకులు విస్మరించారని, ఇలాగైతే పోరాటం తప్పదంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని కూడా ఆయన అన్నారు.
కనీవినీ ఎరుగని మెజారిటీతో విజయం సాధించిన వైసీపీ ఏడాది సంబరాలు జరుపుకోవాల్సిన తరుణంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలే అధికారుల తీరుపై అసమ్మతి గళం విప్పడం ప్రతి పక్షాలకు మరో ఆయుధం ఇచ్చినట్లు అవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.
మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు అనేక ఆటుపోట్లును చవి చూసారు. అటువంటి నేతనే ఒంటి చేత్తో రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తీసిన వైఎస్ జగన్ నేడు సొంత పార్టీలో రేగుతున్న అసమ్మతిని ఎలా చల్లారుస్తారో వేచి చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?