రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి రావడంలో, జగన్ సిఎం అవ్వడంలో రెడ్డి సామాజిక వర్గం కంటే ఆ తరువాత అదే స్థాయిలో ఎస్ సి సామాజిక వర్గం పని చేసింది. రాష్ట్రంలో కులాలు, మతాల ప్రస్థావన తీసుకురాకూడదు అని అనుకున్నప్పటికీ రాజకీయాల్లో మాత్రం కులాల ప్రస్థావన కశ్చితంగా ఉంటోంది. మన రాష్ట్రంలో కుల చైతన్యం, రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంది కాబట్టి కులాల వారిగా పార్టీల అభిమానాలు కూడా ఉన్నాయి.
ఈ క్రమంలోనే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి బిసిలు, కమ్మ,కాపు వర్గాల్లో అభిమానం ఎక్కువగా ఉండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గాల్లో ఉండేది. గడచిన ఎన్నికల్లో కాపులు, బిసిలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు కాబట్టి ఆ పార్టీ గెలిచింది. ఇక జగన్ వెంట మొదటి నుంచి అడుగులు వేస్తున్న దళిత సామాజిక వర్గం మాత్రం జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నానా ఇబ్బందులు పడుతూనే ఉంది. ఎక్కడో ఒక చోట, ఏదో ఒక రకమైన సంఘటన జరుగుతూ ఆ సామాజిక వర్గ భావాలను దెబ్బతీస్తున్నట్లు ఉంది. దీనిలో ప్రభుత్వ ప్రమేయం ఉన్నా లేకపోయినా, వైసిపి నాయకుల ప్రమేయం ఉన్నా లేకపోయినా ఇటువంటి సంఘటనలు మాత్రం ప్రభుత్వాన్ని, వ్యక్తిగతంగా జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ప్రకాశం జిల్లా చీరాలలో దళిత యువకుడిపై పోలీసుల దౌర్జన్యంతో ప్రారంభమైన ఘటనలు కొనసాగుతునే ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో జరిగిన దళిత యువకుడి శిరోముండనం ఘటన జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది, ఈ ఘటనలో బాధితుడు తాను నక్సలైట్ లో చేరేందుకు అనుమతి ఇవ్వండి అంటూ నేరుగా రాష్ట్రపతి భవన్ కు లేఖ రాయడం తీవ్ర సంచనం అయ్యింది. ఈ విషయంలో నేరుగా రాష్ట్రపతి రాంనాధ్ కోవింగ్ స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఘటనలపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. దళితులపై దాడులు జరిగితే ఉపేక్షించవద్దు, కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు కూడా ఇచ్చారు. దాడులకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ సంఘటనలు మరువకముందే చిత్తూరు జిల్లాలో ఒక దళిత యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలాన్ని రేపింది. తొలుత ఈ వివాదంపై పోలీసులు స్పందించలేదు. దళిత యువకుడిని హత్య చేస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ టిడిపి ఆరోపణలు చేసిన అనంతరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి ఖననం చేసిన మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహింపజేశారు. పోలీసు దర్యాప్తులో ఆ యువకుడిది హత్యనా లేక సహజ మరణమా, లేక ఆత్మహత్యనా అనే విషయాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి.
అంతకు ముందు విశాఖలో దళిత వైద్యుడు సుధాకర్ ను పోలీసులు అమానవీయంగా కస్టడీలోక తీసుకుని మెంటర్ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించడం, కోర్టు జోక్యంతో ఆయన ఆసుపత్రి నుండి బయటకు రావడం తేలిసిందే. తాజాగా విశాఖలో నిర్మాత, బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు నివాసంలో దళిత యువకుడి శిరోముండనం ఘటన వీడియో సాక్షాదారాలతో వెలుగులోకి రావడం తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ వరుస ఘటనలు ప్రభుత్వానికి సంబంధం లేకపోయినప్పటికీ దళిత సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని నిందిస్తూ ఆరోపణలు చేస్తున్నాయి. జగన్మోహనరెడ్డి అధికారంలోకి రావడానికి కారణమైన తమ సామాజిక వర్గంపై వరస ఘటనలు జరుగున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న భావన రాకముందే ప్రభుత్వం ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వస్తున్నది.