ఏ ప్రభుత్వానికి అయినా మంచి పేరు ఎప్పుడు వస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో నయా పైసా తీసుకోకుండా అధికారులు, సిబ్బంది సేవలు అందిస్తే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు నెత్తినపెట్టుకుంటారు. ప్రభుత్వాలు మారుతున్నా, పాలకులు మారుతున్నా ప్రభుత్వ శాఖల్లో అవినీతిని మాత్రం రూపుమాపలేకపోతున్నారు. అవినీతిలో అధికారులకు ఎంత పాత్ర ఉందో, ప్రజలకు అంతే మొత్తంలో బాధ్యత ఉంటుంది. తమ పనులు త్వరగా జరగాలని కొందరు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పనులు చేయించుకునేందుకు మరి కొందరు అధికారులకు ముడుపులు ఇస్తూ వారిని లంచావతారులుగా తయారు చేస్తున్నారు. ఒక సారి అవినీతికి అలవాటు పడిన తరువాత సదరు ఉద్యోగులు ఏ పనులకైనా డబ్బులు ఆశించడం రివాజుగా మారుతోంది. అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీల్లో అధికారులు పట్టుబడుతుండటం, అక్రమ ఆస్తులు గుర్తించడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల తెలంగాణలో కోటి రూపాయల అవినీతి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
ఏపీలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే దీనిపై ఒక ప్రకటన చేశారు. అవినీతి రహిత పరిపాలన అందించాలన్నదే లక్ష్యమని స్పష్టం చేశారు. అవినీతి అనేది ఏ స్థాయిలోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు సైతం అక్రమ కార్యక్రమాలకు సిఫార్సులు చేస్తే వినాల్సిన పని లేదని కూడా అధికారులకు సూచించారు. అధికారులు అందరూ నిజాయితీగా ప్రజలకు సేవలు అందించాలని చెప్పారు. సి ఎం జగన్ చేసిన ఆ హెచ్చరికల తరువాత కొద్ది నెలల పాటు దిగువ స్థాయిలో కొంత మేర అవినీతి తగ్గింది. అయితే రానురాను కొందరు ప్రజా ప్రతినిధుల అండదండలతో అక్కడక్కడా ఇసుక, మట్టి, సున్నపురాయి, గ్రావెల్ అక్రమ రవాణాకు తెరలేపడంతో అధికారులు కూడా వారికి అందింది తీసుకుంటూ సహకరించడం మొదలు పెట్టారు.
ప్రజలకు నేరుగా సంబంధం ఉన్న కార్యాలయాల్లో అవినీతి జరగకుండా చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న భావిస్తున్న జగన్మోహనరెడ్డి సర్కార్ ముందుగా రెవెన్యూ శాఖపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని తహశీల్దార్ కార్యాలయాలను ఎంచుకొని అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) అధికారులు తనిఖీలు చేపట్టారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం తహశీల్దార్ కార్యాలయంలో తనిఖీల సందర్భంగా ఏసిబి అధికారులకు రెండు లక్షల 40 వేల రూపాయలు దొరికాయి. అదే విధంగా జగ్గయ్యపేట తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన తనిఖీల్లో కార్యాలయానికి సంబంధం లేని నాలుగు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా విజయవాడ, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోనూ రెవెన్యూ కార్యాలయాలలో తనిఖీలు నిర్వహించారు ఎసిబి అధికారులు. ఈ ఆకస్మిక తనిఖీలతో రెవెన్యూ ఉద్యోగులకు ఒక భయం ఏర్పడింది. ముందుగా రెవెన్యూ శాఖతో పాటు పోలీస్, పంచాయతీరాజ్ వంటి కీలక శాఖలను అవినీతి రహిత శాఖలుగా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.