ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో శుభవార్త చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగస్తులకి రెగ్యులర్ ఎంప్లాయిస్ తరహాలోనే సకాలంలో జీతాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని గ్రీన్ ఛానల్ లో పెట్టాలని తెలిపారు. అంతేకాకుండా ఈ కాంట్రాక్టు ఉద్యోగస్తులకు సామాజిక, ఆరోగ్య భద్రతపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులకు జగన్ ఆదేశించారు. ప్రభుత్వ శాఖలతో పాటు వివిధ సొసైటీలు మరియు విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగస్తుల జీతాల విడుదల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆర్థిక సమావేశంలో జగన్ తెలియజేశారు. ఇప్పటి వరకు వారికి వస్తున్న జీతాలు మరియు స్థితిగతులపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో వివిధ విభాగాలు మరియు సొసైటీలో అదేవిధంగా యూనివర్సిటీ లో పనిచేస్తున్న సుమారు 54 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదని సమావేశంలో అధికారులు సీఎం కి వివరించారు. ఎన్నికల ముందు మినిమం టైం స్కేల్ అంటూ హడావిడి చేసిన టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో విషయంపై జగన్ దృష్టి పెట్టి త్వరగా ఈ జీవోను అమలు చేయాలని కాంట్రాక్టు ఉద్యోగస్తులకు మేలు చేయాలని డిసైడ్ అయ్యారట.
ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై వెయ్యి కోట్ల అదనపు భారం పడుతుందని జగన్ కి చెప్పిన గాని వాటిని పట్టించుకోకుండా మినిమం టైం స్కేల్ తాను ముఖ్యమంత్రిగా వచ్చిన జులై మాసం నుండి అమలు చేయాలి అని అధికారులకు సూచించారట. దీంతో జగన్ తీసుకున్న నిర్ణయంతో 2017 మార్చి 31న ఉన్న జీతాలు.. 2019 జులై నాటికి 88 శాతం నుంచి 95 శాతం వరకు పెరిగాయి. జూనియర్ లెక్చరర్కు రూ.19,050 ఉన్న జీతం 2019 జులై నాటికి 95 శాతం పెరిగి రూ.37,100 అయింది. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మేల్) జీతం రూ.14,860 నుంచి 88 శాతం పెరిగి రూ.22,290 అయింది. సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) జీతం రూ.10,900 నుంచి 95 శాతం పెరిగి రూ. 21,230 అయింది. స్కూల్ అసిస్టెంట్ జీతం రూ. 10,900 నుంచి 95 శాతం పెరిగి 2019 జులై నాటి నుంచి రూ. 21,230 అయిందని అధికారులు సీఎంకు వివరించారు. దీంతో తాజాగా సీఎం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగస్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. చాలా నెలల నుండి అనేక ఈ విషయం లో ప్రభుత్వం పై పోరాడుతున్నామని మా కష్టాన్ని గుర్తించి జీతాలు పెంచినందుకు సకాలంలో ఇస్తాం అని హామీ ఇచ్చినందుకు సీఎం జగన్ కి కృతజ్ఞతలు అంటూ కాంట్రాక్టు ఉద్యోగస్తులు చెప్పుకొస్తున్నారు.