ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి సంక్షేమ పథకాల అమలు విషయంలో తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో పయనిస్తున్నారు. తండ్రి మాదిరిగానే సంక్షేమానికే పెద్దపీట వేస్తున్నారు. నిజానికి ఏదైనా ప్రభుత్వాలు దీర్ఘకాలికంగా ముందుచూపుతో వ్యవహరించాలంటే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి, ప్రగతి, ప్రాజెక్టులపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సి ఉంటింది. కానీ సీఎం జగన్ తొలి ఏడాది పరిపాలన చూసుకుంటే అభివృద్ధి, ప్రాజెక్టులు అనే వాటిని పక్కనపెట్టి కేవలం సంక్షేమ రధాన్ని జగన్ పరుగులు పెట్టిస్తున్నారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమానికి పెద్దపీట వేసినప్పటికీ అభివృద్ధి, ప్రాజెక్టుల ప్రగతిని విస్మరించలేదు. అయితే ఇప్పుడు జగన్ మాత్రం అభివృద్ధిని పూర్తిగా విస్మరించి సంక్షేమ రంగానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అభివృద్ధిని వదలి సంక్షేమ రంగాన్ని పరుగులు పెట్టించడం వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
సంక్షేమానికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే..
వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 45ఏళ్ల నుండి 60ఏళ్ల లోపు ఉన్న ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఒక్కొక్కరికి ఏడాదికి 18,750 చొప్పున పంపిణీ చేస్తున్నారు. దాదాపు 25లక్షల మందికి ప్రభుత్వం 4,700కోట్లు కేటాయించింది. దీనికి గానూ నాలుగేళ్ళలో 20వేల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇక అమ్మవడి పథకం కింద 42.80లక్షల మంది తల్లులకు 15వేల చొప్పున దాదాపు 6600కోట్లు పంపిణీ చేస్తున్నారు. ఐదేళ్లకు 33వేల కోట్లు ఖర్చు అవుతుంది. వైఎస్ఆర్ వాహన మిత్ర కింద 10వేల చొప్పున 2లక్షల 36వేల 343మందికి 236కోట్లు సంవత్సరానికి ఐదేళ్లకు 1380కోట్లు, వైఎస్ఆర్ రైతు భరోసా కింద 48లక్షల మంది రైతులకు ఏటా 13,500కోట్లు, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద లక్షా 35వేల మందికి 10వేల చొప్పున, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన లకు 5,668కోట్లు, వైఎస్ఆర్ కాపు నేస్తం కింద ఏటా 15వేల పంపిణీకి గానూ 4400కోట్లు, ఇవే కాకుండా న్యాయవాదులకు, పాస్టర్లకు, మోజర్లకు గౌరవ వేతనాలు, ఇతర సంక్షేమ పథకాలకు వేల కోట్లు వెచ్చిస్తున్నారు. భారత దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంత భారీ సంక్షేమ పథకాలు అమలు జరగడం లేదు.
ఇప్పటికే రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంది. గడచిన సంవత్సరం లోనే 43వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది. ఇలా సంవత్సరానికి 50 వేల కోట్లు అప్పు తెస్తూ అంతే మొత్తంలో సంక్షేమ పథకాలకు పెట్టడం రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అప్పు చేసి ఇలా సంక్షేమం ఇవ్వడం వల్ల జగన్ కు వచ్చే ఉపయోగం ఏమిటి? రాష్ట్రం దీర్ఘ కాలంగా అభివృద్ధి చెందాలన్నా, ప్రాజెక్టులు, పరిశ్రమలు రావాలన్నా అభివృద్ధి కంపల్సరీ. ప్రస్తుతం జగన్ చేస్తున్న పనులు ప్రభుత్వానికి లాభమా? నష్టమా? మీరే చెప్పండి.