(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” బ్యూరో)
రాష్ట్రంలో వైసీపీ అధికారంలో వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వివిధ వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నా నవరత్న పథకాల అమలుపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అదే మాదిరిగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో తొలి ఏడాదిలోనే 90శాతం వరకూ అమలు చేశారు. నేడు నూతనంగా మరో పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు.
రాష్ట్రంలో బియ్యం (రేషన్) రేషన్ కార్డు ఉన్నవారందరికీ వైఎస్ఆర్ భీమా పథకాన్ని తీసుకువచ్చారు. ఈ భీమా పథకానికి చెల్లించాల్సిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ పథకాన్ని బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహనరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ నిరుపేదల కోసం వైఎస్ఆర్ భీమా పథకం తీసుకువచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వం భీమా పథకం అమలు నుండి తప్పుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ప్రీమియంను భరిస్తోందని దీనికి గానూ ఏడాదికి రూ.510 కోట్లు ప్రీమియంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 1.41 కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందన్నారు. గ్రామ సచివాలయాల్లో ఇన్సూరెన్స్ జాబితాను పెడతమన్నారు. ప్రమాదాల్లో మరణించిన, వైకల్యం కల్గిన కుటుంబాలకు భీమా కవరేజ్ వస్తుందన్నారు. 18 నుండి 50సంవత్సరాల మద్య వయసు వారు ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల రూపాయలు, సహజ మరణానికి రూ.2లక్షల భీమా పరిహారం అందుతుందన్నారు. అదే విధంగా ప్రమాదవశాత్తు పాక్షిక వైకల్యం కల్గితే లక్షన్నర, 51 నుండి 70 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.3లక్షలు భీమా అందుతుందని తెలిపారు. ప్రమాదవశాత్తు చనిపోయిన కుటుంబాలకు తక్షణ సాయంగా పది వేలు గ్రామ సచివాలయం నుండి అందిస్తారని తెలిపారు.