విశాఖపట్నం: ఏపీకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదనలు చేసిన అనంతరం తొలిసారి విశాఖ పర్యటనకు వచ్చిన సీఎం జగన్ కు ఘనస్వాగతం లభించింది. కైలలాసగిరిలో, వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ లో సుమారు రూ.1200 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్ధాపన చేశారు. పార్కులో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటైన్ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం ఆర్కే బీచ్లో జరుగుతున్న విశాఖ ఉత్సవ్లో సీఎం జగన్ పాల్గొన్నారు.
అంతకు ముందు.. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికేందుకు చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా ఏకమై వేలాదిగా తరలివచ్చారు. విమానాశ్రయం నుంచి బయటికి రాగానే పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులందరినీ ఆత్మీయంగా పలకరించి జగన్ కాన్వాయ్లో బయలుదేరారు. పెద్దఎత్తున తరలివచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో విశాఖ నగరం జనసంద్రంగా మారింది. ఉత్తరాంధ్ర జిల్లాలు.. గోదావరి జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. విశాఖ విమానాశ్రయం నుంచి కైలాసగిరి, ఆర్కేబీచ్లోని విశాఖ ఉత్సవ్ వేదిక వరకూ దాదాపు 24 కిలోమీటర్ల మేర భారీ మానవహారం నిర్వహించారు. నగర ప్రజలు.. విద్యార్థులు పెద్దఎత్తున మానవహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్ కాన్వాయ్పై పూల వర్షం కురిసింది. అడుగడుగునా జగన్పై ప్రజలు పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు.