గుంటూరు జిల్లా కాజ టోల్ గేటు వద్ద వైసీపీ మహిళా నేత, వడ్డెర కార్పోరేషన్ చైర్ పర్సన్ దేవళ్ల రేవతి చేసిన పెద్ద హంగామా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టోల్ రుసుము చెల్లించాలని కారు ఆపినందుకు టోల్ ప్లాజా సిబ్బందిపై ఆమె అనుచితంగా ప్రవర్తించడమే కాక బారిగేడ్లు తొలగింపును అడ్డుకున్నందుకు టోల్ ప్లాజా ఉద్యోగిపై చేయి కూడా చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇది కూడా చదవండి..టోల్ గేటు వద్ద కారు ఆపితే ఆ మహిళా నేత ఏమి చేసిందో తెలుసా.. ?
ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారట. వెంటనే ఆమెను పిలిపించమని అధికారులను జగన్ ఆదేశించారు. దీంతో సీఎంఓ నుండి రేవతికి ఫోన్ వెళ్లినట్లు తెలుస్తుంది. ఇటువంటి ఘటనల్లో నేతలపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి చెడుపేరు వచ్చే పరిస్థితి ఉన్నదని భావించిన ముఖ్యమంత్రి జగన్ ఆమెకు వేటు వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకే వెంటనే తాడేపల్లి వచ్చి కలవాలని ఆదేశించారని తెలుస్తోంది. కొద్ది సేపటిలో రేవతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలవనున్నారు. ఆమెతో రాజీనామా చేయించడం గానీ లేక తక్షణం పదవి నుండి తొలగించడం గానీ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.
మరో వైపు దేవళ్ల రేవతి వాదన మరో విధంగా ఉంది. టోల్ గేటు సిబ్బందిపై తనపైన, తన కారు డ్రైవర్ పైన అమర్యాదగా ప్రవర్తించారని ఆరోపించారు. దాదాపు అరగంట పాటు తనపై వారు కారు నిలుపుదల చేసి ఇబ్బంది పెట్టారన్నారు. తన తల్లి ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రికి వెళుతున్న సమయంలో అర్జంట్ గా వెళ్లాలని చెప్పినా అడ్డుకున్నారని తెలిపారు. తనకు ఫ్రీ పాస్ ఉందని, రాష్ట్ర వడ్డెర కార్పోరేషన్ చైర్మన్ అని చెప్పినా ఏ మాత్రం గౌరవం లేకుండా అమర్యాదగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది. దాదాపు అరగంట పాటు టోల్ గేటులో ఉన్న సీసీ టీవీ పుటేజీ బయట పెడితే వాస్తవాలు తెలుస్తాయన్నారు.