(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాజ్యాంగంలో రాజధాని అన్న మాట లేదని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇడుపులపాయ నుంచే పరిపాలన చేయొచ్చుకాదా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
రాజ్యాంగంలో రాజధాని లేనప్పుడు మూడు రాజధానుల ప్రకటన ఎందుకు చేశారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎక్కడ నుండైనా పరిపాలన చేయవచ్చనీ చెబుతున్న జగన్ ఎవరిని మోసం చేసేందుకు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు? విశాఖకు రాజధాని తరలించడం దేనికీ? ఇడుపులపాయ నుండే పాలన చేయవచ్చు కదా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
జగన్ తను ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలను ప్రజలపై రుద్దాలని చూస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో రాజధాని తీర్మానం నిబంధనలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. చెప్పినట్టు వినలేదని మండలినే రద్దు చేస్తానంటున్నారని అన్నారు.
రాజధాని బిల్లును మండలి తిరస్కరించలేదనీ, సెలెక్ట్ కమిటీకి పంపిందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఏపీ పేద రాష్ట్రం అయితే రాజధాని రైతులకు వ్యతిరేకంగా అయిదు కోట్ల రూపాయలు ఇచ్చి న్యాయవాదిని ఎందుకు పెట్టుకున్నారని రామకృష్ణ ప్రశ్నించారు. సిబిఐ కోర్టులో తన తరపున వాదిస్తున్న న్యాయవాదిగా నియమించుకున్నారని విమర్శించారు.జగన్ను మేధావి అయిన తుగ్లక్తో పోల్చడం సరికాదనీ, జగ్లక్గా సంభోధించాలన్నారు. తుగ్లక్ ఎంతో మేధావి అయినా పిచ్చి తుగ్లక్గా పిలవడం పరిపాటి అయిందన్నారు.
వైఎస్కే సలహాలు ఇచ్చిన సీనియర్ మంత్రులు ఇప్పుడు మౌనంగా ఉంటున్నారని అయన అన్నారు. ఇద్దరు వ్యక్తులు ఏపీ ప్రజల తలరాతను రాస్తున్నారనీ విమర్శించారు. సీనియర్ మంత్రులు ఇప్పటికైనా స్పందించాలని రామకృష్ణ సూచించారు.