ఒక పార్టీ అధికారంలోకి వస్తే నాయకులకు అధికారం వచ్చేస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే మాట కంటే అధికార పార్టీలో ఉన్న కార్యకర్త మాటే పెద్దదవుతుంది. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా అధికారం దక్కించుకున్న పార్టీల నుంచి ఒత్తిళ్లు ఉంటాయి. వీటన్నింటినీ బ్యాలన్స్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. ఇది సర్వసాధారణం. అయితే.. కార్యకర్తల నుంచి చోటా లీడర్స్, రెండో కేటగిరీ నాయకుల నుంచి ఎమ్మెల్యేల నుంచి మంత్రులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కారణం.. ఎన్నికల సమయంలోనూ ఇతరత్రా కిందిస్థాయి నాయకులే వీరిని నడిపిస్తూ ఉంటారు. దీంతో అధికారం వచ్చిన తర్వాత వారికి అనుకూలంగా పనులు చేయాలి.. జరుగుతూంటాయి. ఒకవేళ జరక్కపోయినా, ప్రభుత్వంలో వీరి మాట చెల్లుబాటు కాకపోయినా అలకలు అటకెక్కి కూర్చుంటాయి. ఇప్పుడు ఇలాంటి సంకట పరిస్థితినే ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రి నారాయణ స్వామి ఎదుర్కొంటున్నారు.
డిప్యూటీ సీఎంకే చుక్కలా..!
సంక్రాంతి సమయంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం, సంప్రదాయ ఆటలు, ఆచారాలు ఉంటాయి. వీటిని ఆ ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లో మమేకమై పాల్గొనాల్సి ఉంటుంది. ఆంధ్రా ప్రాంతంలో కోళ్ల పందాలు ఎలాంటి సంప్రదాయమో.. రాయలసీమ ప్రాంతంలో జల్లికట్టు అంతే సంప్రదాయ క్రీడ. నిజానికి ఈ ఆట తమిళనాడుకు చెందింది. అయితే.. ఆ రాష్ట్ర సరిహద్దు జిల్లా అయిన చిత్తూరు ప్రాంతంలో జల్లికట్టు నిర్వహిస్తారు. ప్రతి ఏటా కోళ్లపందాలు, జల్లికట్టు నిర్వహణపై ఏకంగా.. సుప్రీంకోర్టు వరకూ వాదనలు వెళ్తాయి. ఈసారి చిత్తూరు జిల్లాలో జల్లికట్టు నిర్వహణ సవాల్ గా మారింది. గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినవారే. ఇంకేముంది.. జల్లికట్టుకు ఎదురుండదు అనుకున్నారు.. స్థానికులు, అక్కడి వైసీపీ క్యాడర్ కూడా. కానీ.. అనూహ్యంగా వారికి పోలీసులు నుంచి ఆంక్షలు వచ్చాయి. జల్లికట్టు నిర్వహణకు వీల్లేదని. దీంతో వెంటనే తమ నాయకుడి దగ్గర వాలిపోయారు. అయితే..
కరెక్ట్ గా ఉన్నా తిప్పలే.. పాపం..!
డిప్యూటీ సీఎం హోదా ఉన్నా కూడా నారాయణ స్వామి చేతులెత్తేశారు. జల్లికట్టు నిర్వహణ నా పరిధిలో లేదు అని. పోలీసులు నా మాట వినలేదు అన్నారు. ఎస్పీతో మాట్లాడినా ఫలితం లేకపోయిందని తేల్చేశారు. ప్రశాంతంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభిద్దామని వచ్చిన మంత్రికి అనునూయుల నుంచి ఒత్తిడి వచ్చింది. మంత్రి ఎంత చెప్పినా వారు పట్టుబట్టారు. దీంతో డిప్యూటీ సీఎంకు అసహనం ఎక్కువైంది. నన్ను రాజకీయాలు వదిలేసి వెళ్లిపోమంటారా..? మీరు వద్దంటే చెప్పండి.. మీ ఇష్టం. కానీ.. గ్రూపు రాజకీయాలు చేయమంటే చేయలేను. రాష్ట్రంలో ఏ మంత్రికీ లేనంత ఒత్తిడి నామీద వస్తోంది. వినయంగా నా పని నేను చేసుకుపోతున్నా ఇబ్బందులు పెడుతున్నారు. కొందరిని గ్రామం నుంచి తరిమేయాలంటే ఎలా? పోనీ ఏమైనా చట్టం ఉందా..? నాకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆమేరకే వెళ్తాను. కొన్నిచోట్ల జల్లికట్టుకు అనుమతులిచ్చారు కదా అని ఎస్పీగారితోనే మాట్లాడాను. ఆయన కుదరదు అంటున్నారు. నన్నేం చేయమంటారు’ అంటూ సొంత పార్టీ నేతలతో అన్నారు. నిజానికి ఇవి అందరిమధ్య అంతర్గత వ్యాఖ్యలు. కానీ.. బయటకు రాకుండా ఉంటాయా? దీంతో డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు రాష్ట్రంలో వైరల్ అయ్యాయి. దీంతో మంత్రిపై ఎంత ఒత్తిడి ఉందో అర్ధమవుతోంది.
అందరిదీ.. ఇదే సమస్యా..?
ఈ సమస్య నారాయణ స్వామికి మాత్రమే కాదు.. ఎవరికైనా స్థానికంగా ఆయా పరిస్థితులను బట్టి ఎదురయ్యే సమస్యే. కాకపోతే.. మంత్రి దీనిని హైలైట్ చేశారు. పదవిలో ఉండే ఏ ఒక్కరైనా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో చెప్పకనే చెప్పుకొచ్చారు. కొందరు ఇంక పైస్థాయిలో పలుకుబడి ఉపయోగిస్తారు. నారాయణస్వామి అలా చేయలేకపోయారు. కరోనా పరిస్థితులు చక్కబడుతున్న వేళ మంత్రి రికమండేషన్ తో పందాలు జరుగి జరగరానిది ఏమైనా జరిగితే మంత్రి బాధ్యులవుతారు. ఇందుకే నారాయణస్వామి వెనక్కు తగ్గారని అంటున్నారు. అయితే.. ఎవరిని గ్రామాల నుంచి తరిమేయాలి అంటూనే.. అధికార పార్టీ వారు ఇలాంటివి చేయకనే చేస్తారు అని నిరూపితమైంది. మొత్తంగా డిప్యూటీ సీఎం తాను ఎదుర్కొన్న సమస్య వల్ల తాను ఉన్న పార్టీలో పరిస్థితి, అందరు రాజకీయ నాయకుల పరిస్థితిని తెలిసేలా చేయగలిగారు.