రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశం ‘ఏపీలో దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం’. ఎవరు చేశారో.. ఎందుకు చేశారో తెలియని ఇటువంటి ఉన్మాదం వల్ల మత ఘర్షణలు, రాష్ట్రంలో శాంతిభద్రతలు తలెత్తే అవకాశం ఉంది. కానీఎవరో ఒకరు వెనకుండి ప్రోత్సహిస్తేనో.. రాజకీయ పార్టీలపై సానుభూతో.. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఆలోచనో లేకపోతే ఇటువంటి దుస్సాహసం చేయలేరు. ఏ ప్రభుత్వం ఏర్పడినా ప్రజల ఓట్లతోనే అధికారంలోకి వస్తుంది కానీ.. ఒక మతం, కులం, వర్గం ఓట్లతో కాదు. మతాలను కించపరిచే పనులు చేయదు.. ప్రజల్లో ఆగ్రహం తెప్పించుకోదు. ఏపీలో జరిగిన ఈ దారుణాలపై ప్రభుత్వం సీరియస్ అయింది. దేశంలో జరిగే ఎన్నో కుట్రల్లో.. పోలీసులు జరిపే విచారణలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తుంది. ఏపీలో విగ్రహాల ధ్వంసంలోనూ అదే జరిగింది. అయితే.. ఏపీ డీజీపీ మాటల్లో రెండు ప్రెస్ మీట్లలో రెండు విధాలుగా స్పందించారు. అందులో వాస్తవాలేంటో పోలిస్ బాస్ కే తెలియాలి.
రెండు తేదీలు.. రెండు వాదనలు
‘జనవరి 15న.. ఆలయాలపై జరిగిన దాడుల్లో ఇప్పటి వరకూ 29 కేసులు నమోదు చేశాం. వాటిలో కుట్రకోణం కనిపించ లేదు. దొంగలు, గుప్తనిధుల వేటగాళ్లు, మూఢ నమ్మకాలు, ఆస్తి గొడవలు, మతిస్థిమితం లేని వారు, అడవి జంతువుల కారణంగా ఘటనలు జరిగినట్లు గుర్తించాం’ అని డీజీపీ అన్నారు. జనవరి 15న.. ‘ఆలయాలపై జరిగిన దాడుల్లో రాజకీయ పార్టీల సానుభూతిపరుల ప్రమేయాన్ని గుర్తించాం. 9 కేసుల్లో 21మంది పాత్రను గుర్తించాం. వీరిలో 17 మంది టీడీపీ, నలుగురు బీజేపీ వారు ఉన్నారు. వీరిలో టీడీపీకి చెందిన 13 మందిని, బీజేపీకి చెందిన ఇద్దరిని అరెస్టు చేశాం. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు’ అన్నారు. మొత్తంగా పోలీసులు విచారణ వేగవంతం చేశామని డీజీపీ వివరించారు. అయితే అయితే.. రెండు రోజుల్లో ఎలా మాట మారుస్తారని రాజకీయ పార్టీలు తప్పుబడుతున్నాయి. లోతుగా జరిపే పోలీసుల విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వస్తాయనేది గమనించాల్సిన అంశం.
కొత్త అంశాలు వెలుగులోకి రావడమూ సహజమే..
ఇక్కడ సంబంధం లేకపోయినా.. ‘1999లో విజయవాడలో ఒక్క ఫ్లైఓవర్ వేయడానికి కూడా అనుకూలత లేదు’ అని అప్పటి సీఎం హోదాలో చంద్రబాబు అన్నారు. కానీ.. 2004లో వైఎస్ వన్ టౌన్ లో ఫ్లైఓవర్ వేయించారు. అదే చంద్రబాబు.. 2014లో అధికారంలోకి వచ్చాక బెంజి సర్కిల్ లో ఫ్లైఓవర్, కనకదుర్గ వారధి పనులు చేపట్టారు. ఇటివల బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అరెస్టు జరిగింది. మొదటి రోజు నుంచి చూస్తే ఏ2గా ఉన్న అఖిలప్రియ ఏ1 అయ్యారు. విచారణలో కొత్తగా నిందితులు వెలుగులోకి వచ్చారు. ఇవన్నీ ఇక్కడ ప్రస్తావనార్హమే అయినా.. ఫ్లైఓవర్ అంశం.. రోజురోజుకీ మారే టెక్నాలజీని సూచిస్తే.. అఖిలప్రియ అంశం పోలీసులు జరిపే లోతైన విచారణను సూచిస్తుంది. ఇలానే ఏపీలో దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం అంశంలో నిందితులను విచారిస్తే కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశాలనే డీజీపీ ప్రస్తావించారు. ఇటువంటి కుట్రలు సామాన్యులు ఎందుకు చేస్తారు? అనే ఆలోచన చేసినా ఎవరు, ఎందుకు ఈ కుట్రలు చేస్తారో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు.
ప్రభుత్వం కోరి సమస్యలు తెచ్చుకుంటుందా..?
ఏ ప్రభుత్వమైనా ప్రజల మన్ననలు పొంది తిరిగి అధికారంలోకి రావాలనే కోరుకుంటుంది కానీ.. ఇటువంటి ఘటనలకు పాల్పడి కూర్చున్న కొమ్మనే నరుక్కోదు. దురదృష్టావశాత్తూ గతంలో ఎన్నడూ లేనంతగా ఏపీలో మత రాజకీయాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే హిందూ దేవాలయాలపై దాడులు ఎక్కువయ్యాయి. దేశంలో ఇటివల ఏపీ పోలీసుల పనితీరుకు ఎన్నో అవార్డులు వచ్చాయి. అలాంటి పోలీస్ వ్యవస్థ లోతుగా జరిపే విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి రావడం జరుగుతుంది. అదే పోలిస్ బాస్ చెప్పుకొచ్చారు. 1992లో వచ్చిన గాయం సినిమాలో కోట శ్రీనివాసరావు.. ఏదొకటి చేయాలని మతకల్లోలాలు రెచ్చగొడతాడు. ఇక్కడ అలా జరిగాయని చెప్పడానికి లేదనుకున్నా.. రాజకీయ పార్టీల ప్రమేయం ఉందని స్వయంగా డీజీపీనే చెప్పారలంటే జరుగుతున్న పరిస్థితులను అవలోకనం చేసుకోవాల్సిందే. ఇటువంటి విషయాల్లో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మానాలి. రాజకీయ పార్టీలు ఇటువంటి వ్యక్తులను పక్కన పెట్టాలి. మీడియా సైతం అసత్య ప్రచారాన్ని నమ్మకూడదు అంటూ డీజీపీ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దేవాలయాలకు రక్షణ లేదనే ప్రచారం కొన్ని రాజకీయ పార్టీల కుట్రేనని చెప్పడం ఆలోచించాల్సిన విషయం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?