ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్టంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్దం చేసారు. నిన్న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసారు. సీసీఎల్ ఏ కమిషనర్, జీఏడీ సర్వీసుల సెక్రటరీ, ప్లానింగ్ విభాగం సెక్రటరీ, సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి, కన్వీనర్ గా ఆర్ధిక శాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతుంది. అరకు పార్లమెంట్ నియోజకవర్గం భౌగోళికంగా పెద్దది కావడంతో ఆ ప్రాంతాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసే విషయంపై కమిటీ అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. మార్చికల్లా ఈ ప్రక్రియ మొత్తం పూర్తిచేయాలని సీఎం అధికారాలను ఆదేశించిన విషయం తెలిసిందే.
అయితే శ్రీకాకుళం జిల్లాను విభజించవద్దని ఇప్పటికే ఆ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాని విభజిస్తే రాజకీయంగా దెబ్బతింటామని అయన పేర్కొంటున్నారు. పార్లమెంట్ నియోజకవర్గం ఆధారంగా విభజన జరిగితే అభివృద్ది చెందిన ప్రాంతాలన్ని విజయనగరం జిల్లాలో కలిసిపోతాయని అయన చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకి మాత్రం విభజన నుండి మినహాయింపు ఇవ్వాలని ధర్మాన కోరుతున్నారు. ధర్మాన వినతిపై నిన్న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో చర్చకు రాలేదని సమాచారం. అయితే సీనియర్ నేత అయిన ధర్మాన ప్రసాదరావు అసంతృప్తిని చల్లార్చేందుకు అయనకు ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యత అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం జిల్లాల విభజన ప్రక్రియ బాధ్యతలు పూర్తిగా ప్రభుత్వ అధికారుల కమిటీకే అప్పగించారు. ఈ నేపథ్యంలో జిల్లా విభజనలో ఏమైనా సమస్యలు ఉంటే నాయకులు కమిటీ దృష్టికి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. కమిటీ నివేదిక ఆధారంగా సీఎం జగన్ జిల్లాల విభజన పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ధర్మాన.. జగన్ నిర్ణయాన్ని గౌరవించి తన పెద్దరికాన్ని నిలబెట్టు కుంటారా? లేక విభేదించి జగన్ కే నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారా? మరేదైనా నిర్ణయం తీసుకుంటారా? అన్నది ఆసక్తిగా మారింది.