ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి ప్రజా సంక్షేమానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భగంగా మొదటి సంవత్సరంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90శాతం అమలు చేసి రికార్డ్ సృష్టించారు. నవరత్నాలు అర్హులందరికి అందేలా జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పుడు తాజాగా జగన్ ప్రభుత్వం డ్వాక్రా సంఘ సభ్యుల రుణాల్లో తొలి విడతను మాఫీ చేసేందుకు సిద్ధమైంది.
సీఎం జగన్ గతంలోనే నాలుగు విడతలుగా రుణాలను మాఫీ చేస్తామని కీలక ప్రకటన చేశారు. ఆ ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా చర్యలు చేపడుతున్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద డ్వాక్రా గ్రూపు సభ్యుల రుణాల్లో తొలి విడతను ప్రభుత్వం సెప్టెంబర్ 11వ తేదీన చెల్లించనుందని తెలుస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 9 లక్షల 33 వేల సంఘాల సభ్యులకు రూ.27,168 కోట్ల రుణం ఉన్నట్లు బ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. తొలి విడతగా ప్రభుత్వం 6,792 కోట్ల రూపాయలు చెల్లించనుంది. ప్రభుత్వం మాఫీ చేసిన సొమ్మును నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలలో జమ చేయనుందని తెలుస్తోంది. కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెలాఖరు వరకు సేకరించనుంది. ఇచ్చిన హామీ మేరకు రుణ మాఫీ ప్రకియ కు జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల డ్వాక్రా మహిళలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు ప్రభుత్వం దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఈ నెల 8 న ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని భావించినప్పటికీ కార్యక్రమం వాయిదా పడింది. రాష్ట్రంలో ఇళ్లు లేని 20 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాటు జరిగాయి. ఆగష్టు 15వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగే అవకాశం ఉందని సమాచారం.