అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో వైఎస్ జగన్ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నదా అంటే అవుననే సమాధానం వస్తుంది. నిమ్మగడ్డ వ్యవహారంలో ప్రభుత్వం ఓ అడుగు వెనక్కి వేసినట్లు కనబడుతున్నా అది వ్యూహాత్మకమేనన్నది సమాచారం. నిమ్మగడ్డ, జగన్ సర్కార్ మద్య సై అంటే సై అనేలా సాగుతున్న న్యాయపరమైన పోరులో జగన్ ప్రభుత్వం ప్రస్తుతం కాస్త వెనక్కి తగ్గినట్టు కనబడుతున్నది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పునర్నియమించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలు చేసిన స్టే పిటీషన్ను మంగళవారం ప్రభుత్వం ఉపసంహరించు కున్నది. ఇదే అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటీషన్ను దాఖలు చేసింది. ఆ మరుసటి రోజే ప్రభుత్వం హైకోర్టు కోర్ట్ లో దాఖలు చేసిన స్టే పిటిషన్ ను వెనక్కి తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించినందు వల్లే హైకోర్టులో వేసిన స్టే పిటీషన్ను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.