AP Governor Change: ఆంద్ర ప్రదేశ్ గవర్నర్ మార్పు తప్పదు అనే సంకేతాలు వస్తున్నాయి. ఈ ఏడాది జూలై 23 నాటికి ఏపీ గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ వచ్చి రెండేళ్లు ముగుస్తుంది. ఆయన పదవీ కాలాన్ని పొడిగించేది, లేనిదీ కేంద్రం ఇష్టం. ప్రస్తుతం జరుగుతున్న చర్చ ప్రకారం ఆయనకు కొనసాగింపు లేనట్టే చెప్తున్నారు. అందుకే కొత్త వారిని నియమించే విషయంలో కేంద్రం కొన్ని పేర్లని పరిశీలిస్తుందని సమాచారం. గవర్నర్ గా హరిచందన్ తీసుకుని కొన్ని నిర్ణయాలు బీజేపీ పెద్దలకు నచ్చలేదని ఓ వైపు కారణంగా చెప్తుండగా.., వయసు రీత్యా ఆయనే తప్పుకుంటున్నారని మరో వైపు కారణాలుగా తెలుస్తుంది.. ఇక ఏపీకి గవర్నర్ మార్పు అనగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుని కొంతమంది తెరపైకి తెచ్చేసారు. కానీ గవర్నర్ మార్పు అవకాశాలు పరిశీలిస్తూ.., నిమ్మగడ్డకి ఇస్తారా.. లేదా అనేది చూద్దాం..!
AP Governor Change: హరిచందన్ నిర్ణయాలతో..!?
ఏపీ గవర్నర్ గా హరిచందన్ 2019 జూలై 24 న బాధ్యతలు స్వీకరించారు. అప్పటికి వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసిపి ప్రభుత్వం ఎలాగైతే వివాదాస్పద నిర్ణయాలు.., ఆర్డినెన్సులు, జీవోలతో కోర్టులలో దొరికిపోయిందో.. గవర్నర్ కూడా కొన్ని ఆర్డినెన్సుల విషయంలో దొరికారు. ఆయనకు కూడా ఓ సారి కోర్టు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీకి ఓట్లు, సీట్లు అసలు లేని ఏపీ లాంటి రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రధాన బలం, బలగం మొత్తం గవర్నర్ మాత్రమే. వారి ద్వారానే కేంద్రానికి కావాల్సిన అంతర్గత నివేదికలు తెప్పించుకుంటుంది. అందుకే ఏపీలో గవర్నర్ విషయంలో బీజేపీ పెద్దలు ఒక స్ఫష్టమైన నిర్ణయంతో ఉన్నట్టు తెలుస్తుంది. రాజధాని వికేంద్రీకరణ సహా.., ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వంటి ఆర్డినెన్సుల్లో గవర్నర్ హరిచందన్ బీజేపీ పెద్దలతో సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. గవర్నర్ కు ఉన్న హక్కులు, పవర్ తో ఆయన ఇటువంటి నిర్ణయాలు ఎన్నైనా తీసుకోవచ్చు. కాకపోతే బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత గవర్నర్ల వ్యవస్థపై పెత్తనం చేస్తూ.., స్వారీ చేస్తుంది. అందుకే మార్పులు తప్పకపోవచ్చు అనేది ఏపీ బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్న మాట..
కొత్తగా పరిశీలిస్తున్న పేర్లు ఇవే..!
టీడీపీలో కొందరు, ఏపీ బీజేపీ నేతల్లో కొంతమంది నాయకులు కూడా ఏపీ గవర్నర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వస్తే బాగుంటుంది అంటూ ప్రచారం చేస్తున్నారు. కొందరు అయితే ఆయనే అంటూ పుకార్లు కూడా సృష్టిస్తున్నారు. నిజానికి నిమ్మగడ్డకి ఆ అర్హత, అనుభవం, సామర్ధ్యం ఉన్నప్పటికీ దాదాపు అసాధ్యమే. ఇప్పుడు అత్యవసరంగా సీఎం జగన్ ని రాజకీయంగా దెబ్బ తీయాల్సిన అవసరం బీజేపీకి లేదు. నిమ్మగడ్డ లాంటి వ్యక్తిని నియమిస్తే గత అనుభవాల దృష్ట్యా ఏం జరుతుంది అనేది బీజేపీ పెద్దలు బాగా ఊహించగలరు. సో.. నిమ్మగడ్డ కాకుండా పక్క రాష్ట్రాల పేర్లు కొన్ని పరిశీలిస్తున్నారు.
* కర్ణాటక సీఎం యడ్యూరప్ప పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. బీజేపీ కేంద్ర నిబంధనల ప్రకారం 75 ఏళ్ళు దాటితే నేరుగా పాలనా పదవుల్లో ఉండకూడదు. సీఎం గా, పీఎం గా ఉండడానికి వీల్లేదు అనేది వారి లోపలి నిబంధన.. అందుకే కర్ణాటక సీఎం యడ్యూరప్పని దించేసి అతనికి ఏపీ గవర్నర్ గా ఇవ్వనున్నారు అనేది ఒక పుకారు. దీనిలో కూడా వాస్తవాలు నిర్ధారించలేం.
* కిరణ్ బేడీ, కేంద్ర మాజీ మంత్రులు, గుజరాత్ రాష్ట్రానికి చెందిన మాజీ ఎంపీల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని చెప్తున్నారు. సో… బీజేపీ పెద్దల నిర్ణయం మాత్రం ఈ సారి సంచలనంగా ఉండబోతుంది.. ఓ నెల రోజులు వేచి చూడాల్సి ఉంది.̣.