ప్రభుత్వంపై విమర్శలు చేసేవారిని ఇరుకున పెట్టేలా ప్రభుత్వం, పోలీసులు, కొన్ని వ్యవస్థలు ముందకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ హయాంలో మంత్రులుగా చేసిన అచ్చెన్నాయుడు రెండు నెలలుగా.. కొల్లు రవీంద్ర నెల రోజులకు పైగా జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలోనే యనమల, అయ్యన్నపై పోలీసులు కేసులు పెట్టి అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. మరో మాజీ మంత్రి మాత్రం ఏమాత్రం బెదరడం లేదు. ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆయన చేసిన పనులపై కూడా అవినీతి మరకలు అంటించి లోపల వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని సమాచారం. ఆయనే దేవినేని ఉమ.
దేవినేని ఉమపై ప్రభుత్వం ప్రత్యేక గురి..
టీడీపీ హయాంలో ఉమ జలవనరుల శాఖ మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం కూడా టీడీపీలో యాక్టివ్ గా ఉన్నారు. చంద్రబాబు, లోకేశ్, తర్వాత ప్రభుత్వంపై ఎక్కువ విమర్శలు చేస్తున్నారు ఉమా. ప్రభుత్వాన్ని ప్రతి అంశంలోనూ ఇరుకునబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి వారిని ప్రభుత్వం ఉపేక్షించడం లేదు. ఇప్పుడు దేవినేన ఉమాను ఉచ్చులో బిగించేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు టెండర్లు, పట్టిసీమ, వెలిగొండ్, హంద్రీనీవా.. టెండర్లను బయటకు తీసి ఉమాను ఇరికేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉందని సమాచారం.
దేవినేని చేసిన విమర్శలు ఇవే..
‘గతేడాది వరదల సమయంలో ప్రభుత్వం ఇస్తానన్న 5వేలు ఇవ్వకపోగా.. ప్రస్తుత సమయంలో భోజనం, మంచినీళ్లు కూడా బాధితులకు ఇవ్వడం లేదు. వరదలపై ప్రభుత్వం ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. బాధితుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినపడుతున్నాయా? ఇళ్ల పట్టాల పేరుతో ముంపు ప్రాంతాల్లో భూముల కొనుగోలు చేసి వందల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. ఉపాధిహామీ నిధులు మెక్కేసారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతుంటే కేబినెట్ సమావేశంలో దానిపై ఎందుకు చర్చ జరపలేదు. బుధవారం ఒక్కరోజే 9782 కేసులు, 86 మరణాలు సంభవించాయి. ప్రజాప్రతినిధులు కొందరు పక్క రాష్ట్రాల్లో కార్పొరేట్ వైద్యం పొందుతున్నారు. ప్రజలకు కూడా అదేస్థాయిలో వైద్యం అందించాలి. రాష్ట్రంలో 3లక్షల కేసులు, 3వేలు మరణాలతో కరోనా కల్లోలం సృష్టిస్తున్నా కేబినెట్లో చర్చించ లేదు. ఈ విషయంలో సీఎం జగన్ ప్రజలకు భరోసా కల్పించడంలో విఫలమయ్యారు’ అని పత్రికాముఖంగా, ట్విట్టర్ లో విమర్శించారు.