(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళింది ఏపీ ప్రభుత్వం…! ప్రభుత్వమేమో ఎన్నికలు వెంటనే పెట్టేయాలి, తాము అన్ని స్వీప్ చేసేయ్యాలి అనే ఆలోచనతో వెళ్ళింది. మరి కోర్టులో ప్రభుత్వం ఆశించినది జరగలేదు. ఎన్నికలు వాయిదా తప్పనిసరి. ఇక ఎన్నికల కోడ్ ప్రస్తుతానికి అటకెక్కింది. కానీ కీలక ప్రాజెక్టులకు ఈసీ అనుమతి తప్పనిసరి. ఈ మధ్య ఏపీ ప్రభుత్వం విపరీతంగా కోర్టు మెట్లెక్కుతుంది. హైకోర్టు చాలక, తాజాగా ఎన్నికల వాయిదా విషయంలో సుప్రీం కి వెళ్లినా ప్రభుత్వానికి అనుకూల తీర్పు రాలేదు. సరే ఈ తీర్పు నేపథ్యం, తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరం.
ఎన్నికల వాయిదాపై రాజ్యాంగ వ్యవస్థగా ఉన్న ఈసీకి, ఏపీ ప్రభుత్వానికి పరోక్ష యుద్ధం మొదలైనట్టే.
ఇసితో తాడో పేడో
ఎన్నికలను వాయిదా వేయడంపై కమిషనర్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సిఎం జగన్మోహనరెడ్డి ఇక తాడోపేడో తేల్చుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎన్నికల కోడ్ అమలులో లేకున్నా నూతన ప్రాజెక్టులకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరుపై సిఎం జగన్ గవర్నర్కు ఫిర్యాదు చేయడం, ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం తెలిసిందే.
ఇళ్లపట్టాలకు అనుమతి ఇస్తారా
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా 25 లక్షల మంది పేదలకు ఉగాది పండుగ నాడు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని సిఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. ఇందుకు గానూ ప్రభుత్వ, ప్రైవేటు భూముల సేకరణ, లేఅవుట్లు, ప్లాట్ల విభజన ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. ఇసితో కయ్యం కారణంగా ప్రభుత్వం చేపట్టే ఈ ప్రాజెక్టుకు ఆయన అనుమతి ఇస్తారా? ఇవ్వరా ? నిబంధనల ప్రకారం నడుచుకుంటారా? తెలియాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు గత తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన పసుపు,కుంకుమ నగదు పంపిణీ, రైతు రుణ మాఫీ చెక్కుల పంపిణీకి ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పలేదు. ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వినతిపై ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందిస్తే ఎటువంటి పేచీ ఉండదు. ఒక వేళ కమిషనర్ అభ్యంతరం వ్యక్తం చేస్తే మళ్లీ వివాదం తలెత్తే అవకాశం ఉంటుంది.
మరో పక్క ఎన్నికల కమిషనర్పై పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలకు పరువునష్టం దావా వేయనున్నారని ప్రచారం జరగడంతో ఆయన ఎంత సీరియస్గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిణామాల క్రమంలో రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఏర్పడిన వివాదం ఏ విధంగా సమసిపోతుందో వేచి చూడాలి.