‘ఎవరైనా.. ఏదైనా పని చేసేటప్పుడు మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించాలి’ అంటూ ఉంటారు. కొందరు మాటలను తూటాల్లా వదిలి చేతలను వదిలేస్తారు.. మరికొందరు మాట్లాడకుండా.. తాము చేయాల్సింది చేసి ఫలితం చూపిస్తారు. ఈ రెండో కేటగిరీలో వచ్చే వ్యక్తి ఏపీ సీఎం జగన్. ఏడాదిన్నర పాలనలో జగన్ ఒక్క ప్రెస్ మీట్ గానీ, ప్రత్యక్షంగా గానీ ఆయన చేయబోయేది చెప్పింది లేదు. కానీ.. ఏం చేయెచ్చో, ఎలా చేయెచ్చో చేతల్లో చేసి చూపించారు. ఇది పొగడ్త కాదు.. ప్రతిష్టాత్మక ‘స్టేట్ ఆఫ్ స్టేట్స్’ స్టడీ-2020 వివిధ రాంగాల్లో మార్కెటింగ్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్ (ఎండీఆర్ఏ)తో కలిసి ఇండియా టుడే సంస్థ రెండేళ్లకోసారి ‘స్టేట్ ఆఫ్ ది స్టేట్స్’ పేరుతో ర్యాంకులు విడుదల చేస్తోంది. ఈ ర్యాంకుల్లో ఏపీకి వచ్చిన అవార్డులే ఇందుకు నిదర్శనం.
సీఎంగా జగన్ పరిపాలనకు గీటురాయి..
ఉచిత పథకాలు, ఎఫ్ఆర్ బీఎంను దాటి అప్పులు, పన్ను బాదుడు.. జగన్ ఏడాదిన్నర పాలనపై ప్రతిపక్షాలతోపాటు రాజకీయ విశ్లేషకులు కూడా చేసిన ఆరోపణలు. సంక్షేమంలో కొంత ప్రగతి తప్ప ఆదాయం, అభివృద్ధి లేదు అని విమర్శలు. వీటన్నింటికీ జగన్ సమాధానం చెప్పకనే చెప్పారు. నిజానికి పై విమర్శల్లో కొద్దిపాటి నిజం లేకపోలేదు. ఆదాయం లేదు.. పన్నుల రూపంలో తీసుకుంటుందే ఎక్కువ. కేంద్ర సాయం కూడా అంతంతమాత్రమే. కానీ.. ‘స్టేట్ ఆఫ్ ది స్టేట్స్’ ర్యాంకింగ్స్ లో ఆర్ధిక, పర్యాటక రంగాల్లో ఏపీ టాప్ ర్యాంక్ సాధించింది. మోస్ట్ ఇంప్రూవ్డ్ కేటగిరీలో రెండో స్థానంలో నిలిచింది. టీడీపీ హయాంలో 2018లో 9వ స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు 2020లో 2వ స్థానానికి రావడం విశేషం.
నిరూపించుకోవాల్సింది ఇంకా ఉంది..
అయితే.. ఇవన్నీ జగన్ లోని పరిపాలనా సామర్ధ్యాన్ని నిరూపిస్తున్నా కొన్ని సందేహాలు నివృత్తి కావాల్సి ఉంది. చెప్పుకోదగ్గ పరిశ్రమలు రాలేదు. పన్నులు పెంచితే కానీ ఆదాయం కనిపించని పరిస్థితి. మరోవైపు.. రాజధాని, పోలవరం అంశాల్లో రాని స్పష్టత. సంక్షేమానికి ఖర్చు మాత్రమే కనపడుతోంది. అయితే.. ఏడాదిన్నర పాలనలో సీఎంగా తన మార్కు చూపించుకున్న జగన్ నిధులు సమకూర్చుకోవడం, అభివృద్ధి వైపు అడుగులేయడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇదే దూకుడు కంటిన్యూ చేస్తే మరో రెండేళ్లలో ఏపీని మరింత సుమున్నతంగా చూపించే అవకాశం ఉంది.