అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో తలనొప్పి ఎదురయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసే అవకాశం లేకుండా పోయింది. ఇంతకు ముందు మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు పచ్చజెండా ఊపుతుందనీ, వెంటనే ఎన్నికల గంట మోగించవచ్చనీ భావించింది రాష్ట్ర ప్రభుత్వం.
అయితే రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ను విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం సోమవారం తీర్పు వెల్లడించింది. నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే 14వ ఆర్థిక సంఘం విడుదల చేసే మూడు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు వెనక్కు వెళ్లిపోయే ప్రమాదం ఉండటంతో హైకోర్టులో రిజర్వేషన్లపై తీర్పును బట్టి తక్షణమే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేపట్టింది. మార్చి నెలాఖరు నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
అయితే స్థానిక సంస్థల ఎన్నికలలో 59.85 శాతం రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్దమని ఏపి రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్రెడ్డి తొలుత హైకోర్టును, ఆ తరువాత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు గత నెల 15న ఎన్నికలపై స్టే ఇచ్చింది. దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై తీర్పు వెలువరించింది.
ఎన్నికల్లో బిసి, ఎస్సి, ఎస్టిలకు 59.85 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తిరస్కరించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని ఆదేశించింది. సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్దంగా 50 శాతానికిపైగా రిజర్వేషన్లు కల్పించడం చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం విడుదల చేసిన జివోను హైకోర్టు రద్దు చేసింది. నెల లోపు బిసి రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల తరువాత ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లనుందనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను అయిదు ఏళ్ళకు ఒక సారి నిర్వహిస్తుంటారు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించలేని ప్రత్యేక పరిస్థితులు ఉంటే గడువు పూర్తి అయినా ఆరు నెలల నుండి సంవత్సరం వరకు ఎన్నికలు జరపని పరిస్థితులు గతంలో ఉన్నాయి.
ఏపీలో 2013జులై లో పంచాయతీ ఎన్నికలు, 2014 ఏప్రియల్ నెలలో ఎం పీ టీ సి, జెడ్ పీ టీ సి ఎన్నికలు, ఆ తరువాత మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం గత నెలలోనే ఎన్నికలు నిర్వహించాలని భావించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ ఘనవిజయం సాధించేందుకు ముందస్తు ప్రణాళికలో భాగంగా అమ్మ ఒడి పధకం నిధులను పిల్లలను పాఠశాలలకు పంపే తల్లుల బ్యాంకు అకౌంట్ లో ప్రభుత్వం జమ చేసింది. పాదయాత్రలో, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో చాలా వరకు నెరవేర్చి స్థానిక సమరం లోనూ సత్తా నిరూపించుకోవాలని వైసీపీ భావించింది. మూడు రాజధానుల ప్రకటన కూడా కలసి వస్తుందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టి లాభపడాలని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పాటు బిజెపి, జనసేన పార్టీలు భావిస్తున్నాయి.