(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి : పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులను చకచకా ఏర్పాటు చేయాలని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి సర్కారుకు ఆదిలోనే హంసపాదుగా బ్రేకులు పడుతున్నాయి. ఓ పక్క రాజధాని తరలింపు పై అమరావతి ప్రాంత రైతులు దాఖలు చేసిన పిటిషన్ల పై హైకోర్టులో కేసులు నడుస్తుండగా కర్నూలుకు కార్యాలయాల తరలింపునకు హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది.
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
పరిపాలనా సౌలభ్యం కోసం వివిధ ప్రభుత్వ కార్యాలయాలను కర్నూలుకు తరలించాలని భావిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు బ్రేక్ వేసింది. విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వయిరీస్ ఆఫీసులను తరలించాలని ప్రభుత్వం జారీ చేసిన జీవో పై నేడు హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ కార్యాలయాల తరలింపును నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. కర్నూలుకు కార్యాలయాల తరలింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
తీపి, చేదు కబుర్లు
హైకోర్టు నుండి కర్నూలు కు కార్యాలయాలకు సంబంధించి ఈ చేదు కబురు అందిన వేళనే జగన్ సర్కారుకు నవరత్న పథకాల్లో ఒకటైన ఇళ్ల స్థలాల పంపిణీకి రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నెల్ ఇస్తూ తీపి కబురు చెప్పింది.
ఇళ్ల పట్టాల పంపిణీకి ఎస్ ఈ సి పచ్చ జెండా
జగన్ సర్కార్ ఉగాది నాడు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇళ్ల పట్టాల పంపిణీకి రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఎన్నికల కోడ్ లేక పోయినా నూతన పధకాలు అమలు చేయాలంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి ఇళ్ల పట్టాల పధకం అమలుకు అనుమతి ఇవ్వాలని లేఖ రాసింది. దీనిపై ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీనితో ఇళ్లపట్టాల పంపిణీకి అవరోధమైన అడ్డంకులు తొలగి పోయాయి. ఎన్నికల సంఘం నుండి అడ్డంకులు తొలగి పోయినప్పటికీ కరోనా వైరస్ భయాల నేపథ్యంలో ఇళ్లపట్టాలను ఉగాది నాడు కాకుండా ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి నాడు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.