AP High Court: చాలా నెలల తర్వాత ఏపీ హైకోర్టులో రాజధాని వికేంద్రీకరణ కేసు విచారణకు వచ్చింది.. ఎప్పుడో ఆగష్టు 2020లో మొదలైన కేసుల విచారణ కరోనా అనీ.., పిటిషన్లు అనీ.. బదిలీలు అని వాయిదాలు పడుతూ వస్తుంది.. ఎట్టకేలకు ఈరోజు (నవంబర్ 15) నుండి రోజువారీ విచారణ ఆరంభమయింది.. అయితే కేసు విచారణ మొదలైన 5 నిమిషాల్లో ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే ఓ కీలక వాదనని వినిపించారు.. కొత్త చీఫ్ జస్టిస్ వచ్చిన మొదటి రోజునే భిన్న వాదనలు, ఆదేశాలు, మాటలు, వాదోపవాదాలు జరగడంతో ఈ కేసు విచారణ ఎంత ఘాటుగా ఉండబోతుందో.. అర్ధం చేసుకోవచ్చు.. మొదటి రోజు జరిగిన విచారణ తీరు పరిశీలిస్తే హైకోర్టు ఒక స్పష్టమైన అవగాహన.., మరోవైపు ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైన వైఖరితోనే ఉన్నట్టు లోతుగా అర్ధం చేసుకోవచ్చు..!
AP High Court: ఆ ఇద్దరూ వద్దు – ప్రభుత్వ వాదనలు.. కుదరదు – సీజే..!!
ఈ కేసు విచారణ త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో పాటూ జస్టిస్ సోమయాజులు, జస్టిస్ సత్యన్నారాయణ మూర్తిలతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ మొదలు పెట్టింది.. దీంతో ప్రభుత్వ తరపు న్యాయవాది ఈ ఇద్దరు న్యాయమూర్తులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. “జస్టిస్ సత్యన్నారాయణమూర్తి, సోమయాజులులను ఈ కేసు విచారణ నుండి తొలగించాలని.., వారికి గత ప్రభుత్వం అమరావతిలో భూములు ఇచ్చినందున కేసు విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు..” దీన్ని చీఫ్ జస్టిస్ కొట్టిపారేశారు. “ప్రతీ న్యాయమూర్తికి రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట భూములు ఉంటాయి. దానికి కేసుల విచారణకు సంబంధం ఉండదు” అంటూ ప్రభుత్వ న్యాయవాది తిరస్కరించారు.. మరోవైపు “వారిపై అభ్యంతరాలను నోట్ చేసుకోవాలి.. లేదా మేము దీనిపై సుప్రీం కి వెళ్తాము..” అంటూ దుశ్యంత్ దువే వాదించారు.. సీజే స్పందిస్తూ “కేసు విచారణ ఇప్పటికే ఆలస్యమైంది. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది అనిపిస్తుంది. కక్షాధారులు కూడా ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది” అంటూ వ్యాఖ్యానించినట్టు సమాచారం..
సుప్రీం కి వెళ్తారా..! వేచి చూస్తారా..!?
ప్రస్తుతం ఈ కేసు విచారణ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకం.. ఒకరకంగా ఏపీ ప్రభుత్వ భవిత, రాష్ట్ర భవిత, సీఎం జగన్ భవిత కూడా ఈ కేసుపైనే ఆధారపడి ఉంది.. ఇటువంటి కేసు విచారణలో అమరావతిలో భూములు లబ్ది పొందిన న్యాయమూర్తులు ఉండడం వైసీపీ ప్రభుత్వానికి ఏ మాత్రం రుచించడం లేదు.. వారు ఉంటె కచ్చితంగా ఆశించినది జరగదు అనే భావనలో సీఎం జగన్ ఉన్నారు. అందుకే ఈ ధర్మాసనంలో మార్పులు చేయాలని.. సుప్రీం కి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. గత ఏడాది అక్టోబరులో సీఎం జగన్ సుప్రీమ్ కోర్టు అప్పటి చీఫ్ జస్టిస్ బాబ్డ్ కి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అమరావతిలో భూ అక్రమాలను కూడా ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ ఫిర్యాదులో ఈ ఇద్దరు న్యాయమూర్తుల పేర్లు కూడా ఉన్నాయి. ఈ ఇద్దరు న్యాయమూర్తులు ఇస్తున్న తీర్పులపై కూడా జగన్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. సో.. ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశం కనిపిస్తుంది. రాజధాని కేసుల విచారణ మొదలైన మొదటి రోజునే ఇన్ని ట్విస్టులు ఉంటె… ఇంకా ఎన్నెన్ని ఉండబోతున్నాయోననే ఆందోళనలు/ సందేహాల్లో సగటు రాజకీయ వర్గాలున్నాయి..!