(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వామపక్షాలైన సిపిఐ, సిపిఎంలు తలోదారి వెతుకుంటున్నాయి. నేతి బీరకాయలో నెయ్యి సామెతగా వామపక్ష పార్టీలో ఐక్యత కూడా అంతే తయారు అయ్యింది.
రాష్ట్రంలో వామపక్ష పార్టీలకు బలమైన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, వ్యవసాయ సంఘాలు ఉన్నప్పటికీ సొంతంగా ఎదగలేని పరిస్థితి కనబడుతోంది. పలు ఉద్యమాల సమయాల్లో వామపక్షాలు ఐక్యతారాగం ఆలపించినా వివిధ ఎన్నికల సమయాల్లో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడమో లేక ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరించడమో కనబడుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో వామపక్షాలు జనసేనతో జతకట్టాయి. అయినా కానీ ఎక్కడా ప్రభావవంతమైన ఓటింగ్ శాతాన్ని కైవశం చేసుకోలేకపోయాయి. ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు.
ఎన్నికల అనంతరం రాష్ట్రంలో శరవేగంగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిజెపితో జనసేన పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో జనసేన పార్టీకి వామపక్షాలు దూరం అయ్యాయి. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వామపక్షాలు ఉమ్మడిగా పోటీ చేయాలని సిపిఎం భావించింది. అయితే సిపిఐ మాత్రం తెలుగుదేశం పార్టీతో కలసి నడవాలని నిర్ణయించుకున్నది. దీంతో సిపిఎం ఒంటిరిగానే పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వామపక్షాల దారులు వేరు అవ్వడంతో వారి మధ్య ఐక్యతకు మరో సారి బ్రేక్ పడింది.
ఇప్పటికే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తాము స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు. అయితే సిపిఎం మాత్రం ఇంత వరకూ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు కానీ ఒక వేళ సిపిఐ..తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తే తాము ఒంటరిగానే పోటీ చేస్తామని సిపిఎం నాయకులు ఒకరు తెలియజేశారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, అంగన్వాడీ తదితర సంఘాల ఉద్యమాల్లో రాజీలేని పోరాటాలు చేసే వామపక్ష పార్టీలు ఎన్నికల్లో స్వతహాగా బలాన్ని పెంచుకోలేకపోవడం గమనార్హం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉన్న విషయం తెలిసిందే.