(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నేపథ్యంలో వేగంగా జరుగుతున్న పరిణామాలు ఇటు రాజకీయ పక్షాల్లో, అటు ప్రజానీకంలో ఆసక్తిని రేపుతున్నాయి.
సీన్ నెం 1: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకున్నది. కరోనా వ్యాధి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ తీరుపై బిజెపి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యులు జివిఎల్ నర్శింహరావు, టిజి వెంకటేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితర నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేయగా, పలువురు నేతలు నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన హింసాత్మక సంఘటనలు, పలు సిగ్మెంట్లలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులను బలవంతంగా రంగంలో నుండి తప్పించిన సంఘటనలు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరును బిజెపి నేతలు అమిత్ షా దృష్టికి తీసుకువచ్చారు. అదే రోజు హైకోర్టు కూడా ఎన్నికల నిర్వహణ తీరుపై రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆరు వారాలు ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఆదివారం ఉదయం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.
సీన్ 2: ఎన్నికల సంఘం ప్రకటన వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి హుటాహుటిన వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయ్యారు. ఎన్నికల వాయిదాపై కమిషనర్ ఏకపక్షంగా నిర్ణయంగా తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. తక్షణం ఎన్నికలు జరిపేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల కమిషనర్ వ్యవహరించిన తీరుపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కులాభిమానంతోనే ఆయన చెప్పినట్లు విని ఎన్నికలను వాయిదా వేశారన్నట్లుగా చెప్పుకొచ్చారు. తక్షణం ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోకపోతే ఉన్నత స్థాయికి ఈ విషయాన్ని తీసుకువెళతామని వెల్లడించారు.
సీన్ 3: ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన, బిజెపి అధ్యక్షులు పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ, వామపక్షాల నేతలు రామకృష్ణ, మధులు స్వాగతించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్పై ముఖ్యమంత్రి జగన్ చేసిన విమర్శలను వారు ఖండించారు. ఇప్పటి వరకూ ఏకగ్రీవంగా జరిగిన ఎన్నికలను కూడా రద్దు చేసి నామినేషన్ల ప్రక్రియ మొదటి నుండి నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.
సీన్ 4: రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖలు రాశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదనీ, పరిస్థితి అదుపులోనే ఉందని వివరిస్తూ ఎన్నికలు యధావిధిగా చేపట్టేందుకు కార్యాచరణ చేపట్టాలని విన్నవించారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంకి లేకుండా కరోనా నియంత్రణ చర్యలు చేపట్టవచ్చని లేఖలో పేర్కొన్నారు. పోలింగ్ రోజున జనం గుడిగూడకుండా నియంత్రించవచ్చని తెలిపారు. మరో మూడు, నాలుగు వారాల పాటు కరోనా నియంత్రలోనే ఉంటుందని వారు పేర్కొన్నారు.
సీన్ 5: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిశారు. రాజ్భవన్లో గవర్నర్ను కలిసి స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు గల కారణాలను వివరించారు. ఏ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో గవర్నర్కు వివరించారు. ఎస్ఇసి నిర్ణయంపై సిఎం జగన్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో గవర్నర్ ఆయన్ను పిలిపించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో జాతీయ స్థాయి ప్రతినిధులతో దీనిపై చర్చించిన తరువాత స్థానిక ఎన్నికలను వాయిదా వేశామని కమిషనర్ వివరించినట్లు తెలుస్తోంది. జాతీయ విపత్తు ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించినట్లు ప్రకటన వచ్చిన తక్షణమే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామని కమిషనర్ వివరించారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయనంత వరకూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పల్నాడు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు తదితర జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ సందర్భంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మాచర్ల తదితర ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై నేడు హైకోర్టులో విచారణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హజరై వివరణ ఇవ్వాల్సి ఉన్నది.
మరో పక్క ఎస్ఇసి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలు తక్షణం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుబడుతోంది. కరోనా భయం విడనాడే వరకూ ఎన్నికలను వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. గవర్నర్తో ఎన్నికల కమిషనర్ భేటీలో ఫైనల్గా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారా? లేక వాయిదా నిర్ణయమే సరైందని భావించారా అనే విషయాలు తెలియరాలేదు. ఇదిలా ఉండగా స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టును ఏపి ప్రభుత్వం ఆశ్రయించింది. హెల్త్ ఎమర్జెన్సీ కారణంగా చూపి ఎస్ఇసి ఎన్నికలు వాయిదా వేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటుందా? లేదా అన్నది రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతున్నది. ఇదిలా ఉండగా స్థానిక ఎన్నికలు వెంటనే జరిపించాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. లంచ్ మోషన్ పిటిషన్ను ధర్నాసనం అనుమతించింది. ఈ రోజు మధ్యాహ్నం విచారణకు రానున్నది. ఈ పరిణామాల క్రమంలో రాష్ట్రంలో ఏమి జరుగుతుందో ఆన్న ఆసక్తి సర్వత్రా నెలకొన్నది.